నిండు గర్భిణి బలవన్మరణం

18 Oct, 2019 08:25 IST|Sakshi
శ్యామలబాయి మృతదేహం

రెండోసారి కుమార్తె పుడుతుందని అత్తింటి వారి వేధింపులు

చెరువులో దూకి ఆత్మహత్య  చేసుకున్న మహిళ

కొత్తచెరువులో ఘటన

కొత్తచెరువు (అనంతపురం) : అత్తింటి వేధింపులు తాళలేని ఓ మహిళ  చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు..బుక్కపట్నంలోని ఎస్‌బీఐ కాలనీకి చెందిన నాగాలాల్‌ కటిక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య సరోజాబాయికు నలుగురు ఆడపిల్లలు కలిగారు. ఇందులో మెదటి ముగ్గురు కూతుర్లకు వివాహం చేశాడు. ఇందులో మూడో కుమార్తె శ్యామలబాయి(30)ని కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరుకు చెందిన వర్మాజీ కుమారుడు సునీల్‌కి ఇచ్చి 2013లో వివాహం జరిపించాడు. సునీల్‌ ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో నాగాలాల్‌ అప్పులు చేసి కట్నకానుకలు భారీగానే ఇచ్చాడు. సునీల్‌ దంపతులకు మొదట కుమార్తె కలిగింది. ఇంత వరకూ సంసారం సజావుగా సాగింది. 

శ్యామలబాయి మృతదేహం
స్కానింగ్‌ తెచ్చిన వేధింపులు..  
ప్రస్తుతం శ్యామలాబాయి 7 నెలల గర్భిణి. ఇటీవల అత్తింటి కుటుంబ సభ్యులు స్కానింగ్‌ చేయించారు. స్కానింగ్‌ రిపోర్టులో అమ్మాయి అని తెలిసింది. అప్పటి నుంచి అత్త, భర్త సోదరి శ్యామలను నష్టజాతకురాలు అంటు వేధిస్తూ ఉండేవారు. అంతేగాక అబార్షన్‌ చేయించుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారు.ఈనేపథ్యంలో బుధవారం ఆమె అత్తింట్లో గొడవపడి పుట్టింటికి చేరుకుంది. గురువారం ఉదయం తల్లి సరోజాబాయితో కలిసి హెల్త్‌ చెకప్‌ కోసం పుట్టపర్తికి వచ్చారు. అనంతరం తల్లిని ఆసుపత్రి వద్దే ఉండమని చెప్పి పుట్టపర్తి నుంచి కొత్తచెరువుకు బస్సులో వచ్చేసింది. కొత్తచెరువు నుంచి నడుచుకుంటు బుక్కపట్నం రోడ్డులోని మొదటి తూమువద్ద చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

భర్త, కుమార్తెతో శ్యామలాబాయి

మరిన్ని వార్తలు