బంజారాహిల్స్ పింఛన్ ఆఫీస్ వద్ద రోడ్డు ప్రమాదం
‘ఎల్లో’ సిగ్నల్ లైట్ను పట్టించుకోని ఆర్టీసీ డ్రైవర్
సాఫ్ట్వేర్ ఇంజనీర్ను ఢీకొన్న బస్సు
ముందు చక్రం కింద నలిగి చనిపోయిన వైనం
హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ తొందరపాటు ఆమె పాలిట శాపమైంది. రహ దారి సిగ్నల్ను పట్టించుకోని ఆ డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా ముందుకు నడిపాడు. అదే సమయంలో రోడ్డు దాటుతున్న ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెవులకు ఇయర్ ఫోన్లు ఉండటంతో ఇది గమనించలేదు. దీంతో ఆమెను బస్సు బలంగా ఢీకొట్టింది. కిందపడిన ఆమె పైనుంచి బస్సు ముందు చక్రం వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలు 4 నెలల గర్భిణి కావడం గమనార్హం. ఈ హృదయవిదారక ఘటన బుధవారం బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని పింఛన్ ఆఫీస్ సిగ్నల్స్ వద్ద చోటు చేసుకుంది. భద్రాద్రి జిల్లా కొత్తగూడానికి చెందిన అరవెల్లి శిరీష (26) సాఫ్ట్వేర్ ఇంజనీర్. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని రత్నదీప్ సూపర్ మార్కెట్ పై అంతస్తులో ఉన్న సిన్సి సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నారు.
భర్త మురళీకృష్ణమాచార్యులతో కలసి గాజులరామారంలో నివసిస్తున్నారు. బుధవారం ఉద యం పింఛన్ ఆఫీస్ చౌరస్తాలో బస్సు దిగిన శిరీష.. ఎల్లో లైట్ పడటంతో రోడ్ నం.12 వైపు వచ్చేందుకు రోడ్డు దాటడానికి ఉపక్రమించారు. అదే సమయంలో మాసబ్ట్యాంక్ వైపు నుంచి బంజారాహిల్స్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు సిగ్నల్స్ను పట్టించుకోకుండా మృత్యుశకటంలా దూసుకొచ్చింది. రోడ్డు దాటుతున్న శిరీషను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే శిరీష మృతి చెందిందని గుర్తించిన స్థానికులు బస్సును ఆపి ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు డ్రైవర్ కె.బాబును అరెస్ట్ చేశారు.