కరెంట్‌ షాక్‌తో గర్భిణి మృతి

9 Jul, 2020 13:02 IST|Sakshi
అనిత (ఫైల్‌)

స్విచ్‌ వేస్తుండగా షాక్‌

మల్లూర్‌తండాలో విషాదం

నిజాంసాగర్‌(జుక్కల్‌): కరెంట్‌ షాక్‌తో నునావత్‌ అనిత(26) అనే గర్భిణి మృతి చెందిన సంఘటన నిజాంసాగర్‌ మండలం మల్లూరు తండాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. తండాకు చెందిన అనిత రోజూ మాదిరిగా మంగళవారం రాత్రి ఇంట్లో పిల్లలు, భర్తతో నిద్ర పోయారు. రాత్రి సమయంలో ఉబ్బరంగా ఉండటంతో ఫ్యాన్‌ వేసేందుకు అనిత లేచింది. స్వీచ్‌ బోర్డుపై వైర్లు తేలి ఉండటంతో ఆమెకు షాక్‌ తగిలింది. షాక్‌తో ఆమె చేతివేళ్లు కాలిపోయి, కుప్పకూలింది.

ఆ అలికిడికి భర్త పిల్లలు లేచి చూసే సరికే అనిత మృతి చెందింది. ఆమె ప్రస్తుతం పంచాయతీ వార్డుసభ్యురాలు. సర్పంచ్‌ దరావత్‌ శాంతిబాయి బాబర్‌సింగ్‌ అక్కడికి చేరుకొని పోలీసులు, ట్రాన్స్‌కో అధికారులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం ట్రాన్స్‌కో అధికారులు, పోలీసులు మల్లూర్‌ తండాకు వెళ్లి సంఘటన తీరును తెలుసుకున్నారు. మీటర్‌ నుంచి స్విచ్‌ బోర్డుకు కరెంట్‌ సరఫరా అయ్యే వైర్లు తేలి ఉండటంతో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందినట్లు నిర్దారించారు. ఈ మేరకు పోలీసులు కేను నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. అనితకు భర్త బల్‌రాం, కూతుర్లు మీనాక్షి, వర్షిత ఉన్నారు.

మరిన్ని వార్తలు