పూజారి దారుణ హత్య

18 Apr, 2019 09:57 IST|Sakshi
సంఘటన స్థలంలో విచారణ చేస్తున్న పోలీసులు

తమిళనాడు, అన్నానగర్‌: అయ్యలూర్‌ సమీపంలో మంగళవారం పూజారిని దారుణంగా నరికి హత్య చేశారు. దిండుక్కల్‌ జిల్లా వడమదురై సమీపంలోని అయ్యలూర్‌ నయినాన్‌కులత్తుపట్టికి చెందిన ముత్తుస్వామి (60) అదే ప్రాంతంలోని ఓ ఆలయంలో పూజారిగా ఉంటున్నాడు. భార్య వసంత, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముత్తుస్వామి, నాచ్చి అనే మహిళను రెండో వివాహం చేసుకుని వడమదురై – తిరుచ్చి రోడ్డులో ఉన్న మందైకులం ప్రాంతంలో నివసిస్తున్నాడు. సోమవారం ముత్తుస్వామి నయినాన్‌కులత్తుపట్టికి వెళ్లాడు. మొదటి భార్య కుమారులు పాండిరాజన్‌ (27), వీరమణి (26) ఆస్తిని విభజించి ఇవ్వమని ముత్తుస్వామిని అడిగారు.

ఈ క్రమంలో తండ్రీ కుమారుల మధ్య తగాదా ఏర్పడింది. స్థానికులు సర్ది చెప్పి ముత్తుస్వామిని పంపించారు. మంగళవారం మందైకులం ప్రాంతంలో ముత్తుస్వామి నరికిన గాయాలతో మృతి చెంది కనిపించాడు. స్థానికులు వడమదురై పోలీసులకు సమాచారం అందించారు. ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ సంఘటన స్థలానికి వచ్చి విచారణ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దిండుక్కల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో ముత్తుస్వామి కత్తితో నరికి హత్య చేసినట్లు తెలిసింది. ఆస్తి విభజించి ఇవ్వకపోవడం వల్ల మొదటి భార్య కుమారులే హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు