భోజనం బాగాలేదంటావా.?

22 May, 2018 17:30 IST|Sakshi

డెహ్రాడున్: స్కూల్లో పెడుతున్న మధ్యాహ్న భోజనం బాగాలేదని ఫిర్యాదు చేసిన విద్యార్థిని ఇనుప రాడ్డుతో కొట్టాడు ఓ ప్రిన్సిపాల్. ఈ ఘటన డెహ్రాడూన్‌లోని ఓల్డ్‌ దలన్‌వాలా ప్రాంతంలో చోటుచేసుకుంది. రాహుల్ కుమార్‌(11) అనే పిల్లాడు ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోవడంతో.. రాహుల్ ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ బానో దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందేలా చూడాల్సిన ప్రిన్సిపాలే ఫిర్యాదు చేసిన రాహుల్‌ను ఇనుప రాడ్‌తో కొట్టారు. 

దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన రాహుల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రాహుల్ తండ్రి ధర్మేంద్ర పాశ్వాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశామని ఓ విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు. ప్రస్తుతం రాహుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు