గతేడాది డిసెంబరులో విజిలెన్స్ అధికారులకు చిక్కిన అధికారి
భువనేశ్వర్: విధి నిర్వహణలో ఉంటుండగానే అవినీతికి పాల్పడి విజిలెన్స్ అధికారులకు పట్టుబడిన ఐఏఎస్ అధికారి విజయకేతన్ ఉపాధ్యాయ్ ఇప్పుడు కటకటాలపాలయ్యారు. గతేడాది డిసెంబరు 30వ తేదీన లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ అధికారులకు ఆయన చిక్కారు. ఈ క్రమంలో ఆయనకు విధించిన రిమాండ్ ప్రస్తుతం ముగియడంతో స్థానిక ఝరపడా జైలుకు ఆయనను ఆదివారం తరలించారు.
2009వ సంవత్సరపు ఐఏఎస్ బ్యాచ్కు చెందిన వ్యక్తి విజయకేతన్ ఉపాధ్యాయ్. రాష్ట్ర ఉద్యాన విభాగం డైరెక్టర్ హోదాలో ఓ బిల్లు పాస్ చేసేందుకు రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసి, దానిని తీసుకుంటుండగా అధికారులకు పట్టుబడ్డాడు. నా సర్కారు కార్యాచరణలో భాగంగా ప్రజాభిప్రాయం మార్గదర్శకంతో చైతన్యవంతమైన ప్రజలు ఆయన అవినీతి చర్యలపై విజిలెన్స్ వర్గాలకు రహస్య సమాచారం అందజేశారు. నిందిత అధికారి ఇల్లు, కార్యాలయం, సొంత ఊరు, అత్తవారి తరఫు ఇల్లు ఇతరేతర ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు జరిపి, అనుబంధ వివరాలను సేకరించారు.