ప్రైవేట్‌ బస్సు బోల్తా..

21 Apr, 2018 14:18 IST|Sakshi
కల్వర్టులో బోల్తాకొట్టిన బస్సు

11 మందికి గాయాలు

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

కట్టంగూర్‌ మండల పరిధిలో ఘటన

కట్టంగూర్‌ (నకిరేకల్‌) : మండటంలోని అయిటిపాముల గ్రామ శివారు లో శుక్రవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలం నుంచి హైదరాబాదుకు 48 మంది ప్రయాణికులతో వెంకటేశ్వర ప్రైవేట్‌ ట్రావెల్‌బస్సు గురువారం రాత్రి గం.10 బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున గం.4 సమయంలో మార్గమధ్యలోని అయిటిపాముల గ్రామశివారులోకి చేరుకోగానే డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవటంతో హైవే పక్కనే ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టి బస్సు అదుపు తప్పి కల్వర్టు గుంతలో బోల్తాకొట్టింది.

కల్వర్టు గుంతలోని నీరు బస్సులోకి చేరటంతో గమనించిన ప్రయాణికులు బస్సు వెనక, ముందు గ్లాసులను ధ్వంసం చేసి సురక్షితంగా బయటపడ్డారు. గుంత తక్కువ లోతు ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన దుర్గాభవాని, శ్రీనివాస్, గోపి, అప్పారావు, పావని, పుష్పలత, లక్ష్మికుమారి, ధర్మరాజు, లక్ష్మి, రాము, గాయిత్రి, లిఖిత, యశ్వస్వినిలను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరపుతున్నట్లు ఎస్‌ఐ రంజిత్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు