ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

3 Dec, 2019 03:39 IST|Sakshi
అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిలో చర్లపల్లి గ్రామం వద్ద కాలిపోతున్న బస్సు

ప్రమాదాన్ని పసిగట్టి ప్రయాణికులను దింపేసిన డ్రైవర్‌  

30 మంది ప్రయాణికులు క్షేమం 

నల్లగొండ క్రైం: నల్లగొండ సమీపంలోని అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో మంటలు లేచి బస్సు పూర్తిగా కాలిపోయింది. నల్లగొండ రూరల్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తున్న గాయత్రీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నల్లగొండ మండలం చర్లపల్లి వద్దకు వచ్చిన సమయంలో ముందునుంచి పొగలు రావడాన్ని డ్రైవర్‌ గమనించాడు.

వెంటనే బస్సును పక్కకు నిలిపి అందులో ఉన్న 30 మంది ప్రయాణికులను లగేజీతో సహా కిందికి దింపాడు. అనంతరం బస్సు ఇంజెన్‌ వైర్ల షార్ట్‌ సర్క్యూట్‌తో పొగలు రావడాన్ని గమనించి ఆర్పేందుకు యత్నించాడు. ఇసుక, నీటిని పోసి పొగలు అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ మరింత ఎక్కువగా వస్తుండటంతో డ్రైవర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే మంటలు చెలరేగి బస్సును పూర్తిగా చుట్టుముట్టాయి. పోలీసులు, అగ్నిమాపక అధికారులు వచ్చే లోపే బస్సులో మంటలు ఎగిసిపడ్డాయి. అగ్నిమాపక అధికారులు మంటలను చల్లార్చారు.  ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు