పెరంబూరు(చెన్నై): సంగీత జ్ఞాని ఇళయరాజాకు వ్యతిరేకంగా చిత్ర నిర్మాతలు చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. సంగీత దర్శకుడు ఇళయరాజా తన పాటలను అనుమతి లేకుండా ఏ వేదికపైనా పాడరాదని ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అంతేకాదు, గత ఐదేళ్లుగా తన పాటలకు రాయల్టీని వసూలు చేస్తున్నారు. ఈ విధానానికి చెక్పెట్టేలా ‘పులి’ చిత్ర నిర్మాత పీటీ సెల్వకుమార్, అన్బుసెల్వన్, జపజోన్స్, మీరాకధిరవన్, మణికంఠన్, చంద్రశేఖర్ తదితర నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. పీటీ సెల్వకుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తాను సంగీతాన్ని అందించిన పాటలపై తనకే హక్కంటూ వాటిపై ఇళయరాజానే రాయల్టీ పొందడం చట్ట విరుద్ధమన్నారు. పాటల రాయల్టీలో చిత్ర నిర్మాతకు కనీసం 50 శాతం చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ వేశామన్నారు.