ప్రేమించలేదని యువతిపై దాడి

14 Feb, 2018 12:20 IST|Sakshi
ప్రేమోన్మాది చేతిలో గాయపడిన యువతి ,పోలీసుల అదుపులోఉన్న ప్రేమోన్మాది ప్రసాద్‌

అడ్డొచ్చిన మరో ముగ్గురిని గాయపరిచిన ప్రేమోన్మాది

కాకినాడ రూరల్‌/ భానుగుడి: ప్రేమికుల రోజుకు ఒక రోజు ముందు తనను ప్రేమించలేదన్న అక్కసుతో ఓ ప్రేమోన్మోది చేసిన దాడి జిల్లా కేంద్రం కాకినాడలో కలకలం రేపింది. అడ్డు వచ్చిన మరో ముగ్గురిపై కూడా తన ఉన్మాదాన్ని చూపించి కత్తితో గాయపరిచాడు. ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇలాంటి ఘనట చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళన కలిగించింది. కాకినాడ రాజీవ్‌ గృహకల్పకు చెందిన ఆకూరి ప్రసాద్‌ అనే యువకుడు కొంత కాలంగా పొక్‌లైన్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడు సాంబమూర్తినగర్‌ ఐదో వీధికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతూ వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని రోజూ బెదిరింపులకు దిగేవాడు. ఎప్పటికప్పుడు ఆ యువతి ప్రసాద్‌ ప్రేమను నిరాకరిస్తూ వస్తోంది. మంగళవారం రాత్రి మహాశివరాత్రి సందర్భంగా సాంబమూర్తినగర్‌లోని కనకదుర్గమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల సందర్భంగా దీపాలు వెలిగించేందుకు ఆ యువతి వచ్చింది.

దీపాలు వెలిగిస్తున్న సమయంలో ఆ యువతి వద్దకు ప్రసాద్‌ వచ్చి నన్ను ప్రేమించాలని, నిర్ణయం ఇప్పుడే చెప్పాలంటూ పట్టుబట్టాడు. ఆమె అందుకు తిరస్కరించింది. ఆగ్రహంతో ఊగిపోయిన ప్రసాద్‌ ఆ యువతిని చున్నీతో రోడ్డుపైకి లాక్కుంటూ వెళ్లి కత్తితో దాడి చేశాడు. సమీపంలోనే టీ తాగుతున్న కుడిపూడి సత్యనారాయణ, పితాని శ్రీను, మేడిశెట్టి సదాసాంబశివలు ఈ సంఘటన చూసి అతడ్ని అడ్డుకున్నారు. ఆమెను విడిపించేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రసాద్‌ బ్లేడులాంటి వస్తువుతో వారిపై దాడి చేశాడు. యువతికి చిన్నపాటి గాయం కాగా, ముగ్గురికి గుండెలపైన తుంటిపైన గాయాలయ్యాయి. గాయపడిన ముగ్గుర్ని కాకినాడ జీజీహెచ్‌కు 108 వాహనంలో తరలించారు. దాడికి పాల్పడిన ప్రేమోన్మోది ఆకూరి ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాగా మద్యం తాగి ఉండటంతో అతడ్ని పోలీసులు ఆస్పత్రికి తీసుకొచ్చి పరీక్షలు చేయించారు. త్రీ టౌన్‌ సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో ఎస్సై పి.కిశోర్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు