నకిలీ నోట్ల రాకెట్ : షాకైన పోలీసులు

11 Jun, 2020 08:16 IST|Sakshi

సాక్షి,  ముంబై : మహరాష్ట్రలోని పుణేలో భారీ ఎత్తున నకిలీ నోట్లను ముద్రిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించారు. కోట్లాది రూపాయల విలువైన  స్వదేశీ, విదేశీ కరెన్సీని చూసి పోలీసు ఉన్నతాధికారులే షాక్ అయ్యారు. దీనికి సంబంధించి ఆర్మీ సిబ్బంది సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

సదరన్ కమాండ్ ఇంటెలిజెన్స్ వింగ్, పూణె క్రైం బ్రాంచ్ జాయింట్ ఆపరేషన్‌లో బుధవారం(జూన్ 10)న  ఈ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. మిలటరీ ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించామని డిప్యూటీ పోలీసు కమిషనర్ క్రైమ్ బచ్చన్ సింగ్ వెల్లడించారు. మిలటరీ ఇంటెలిజెన్స్ సహకారంతో నిర్వహించిన దాడిలో ఒక జవానుతో పాటు మరికొందరు దొంగ నోట్లను ముద్రిస్తున్నారని చెప్పారు. వీటిలో వెయ్యి రూపాయల నోట్లను మినహాయించి రూ. 43.4 కోట్లు స్వదేశీ నోట్లు, రూ. 4.2 కోట్లు విదేశీ కరెన్సీ ఉన్నట్టు వివరించారు. దీనిపై ఉన్నతాధికారులు మరింత విచారణ జరుపుతున్నారనీ అదుపులోకి తీసుకున్న జవాన్‌ను పూణెలోని ఆర్మీ అధికారులకు అప్పగించామని తెలిపారు.  (పెట్రో వడ్డింపు : ఎంత పెరిగిందంటే)

అరెస్టయిన ఆరుగురిలో భారత ఆర్మీ జవాన్ షేక్ అలీమ్ గులాబ్ ఖాన్,  ఇతరులు సునీల్ బద్రీనారాయణ సర్దా, రితేష్ రత్నాకర్, తుఫైల్ అహ్మద్ మహ్మద్ ఖాన్, రెహ్ముతుల్లా ఖాన్, అబ్దుల్ రెహమాన్ ఖాన్ అని పూణే సంయుక్త పోలీసు కమిషనర్ రవీంద్ర షిస్వే తెలిపారు. (ఫెడ్ ఎఫెక్ట్ : లాభాలకు చెక్)

పోలీసులు అందించిన మరిన్ని వివరాలు
రూ .43.4 కోట్ల విలువైన భారత కరెన్సీ,  రూ .4.2 కోట్ల విలువైన యుఎస్ డాలర్లు 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు బదులుగా ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో ముద్రణ  
వీటిలో  2016 లో  కేంద్రం రద్దు చేసిన  పెద్ద నోట్లు కూడా ఉన్నాయి.
ఈ నకిలీ నోట్ల కట్టల్లో మొదటి నోటు మాత్రమే అసలుది ఉంటుంది.
ఒక నకిలీ పిస్తోల్ స్వాధీనం  

మరిన్ని వార్తలు