వేధింపుల కేసు: బీజేపీ చీఫ్‌ కుమారుడికి బెయిల్‌

11 Jan, 2018 18:00 IST|Sakshi

సాక్షి,  చండీగఢ్‌: యువతిపై వేధింపుల కేసులో హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్‌ బరాలా కుమారుడు వికాస్‌ బరాలాకు బెయిల్‌ మంజూరైంది. గతంలో కింది కోర్టులో నాలుగుసార్లు వికాస్‌ బెయిల్‌ పిటీషన్‌ కొట్టివేయగా, ఐదోప్రయత్నంగా పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. యువతి కారు అడ్డగింత, వేధింపులు, కిడ్నాప్‌ యత్నం కేసులో గతేడాది ఆగస్టు 9న వికాస్‌ను, అతడి స్నేహితుడు ఆశిష్‌ కుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 

మంగళవారం నాడు బాధితురాలు వర్ణికా కుందును బరాలా కౌన్సిల్‌ దాదాపు ఐదు గంటలపాటు కొన్ని వందల ప్రశ్నలు అడిగారు. అనంతరం రెండు రోజులకు గురువారం నిందితుడు వికాస్‌ బరాలకు పంజాబ్‌, హర్యానాల ఉమ్మడి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గతేడాది ఆగస్టు 4న చండీగఢ్‌లోని సెక్టార్‌ 8లో వర్ణికా కుందు తన కారులో వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న వికాస్ తన స్నేహితుడు ఆశిష్‌తో కలిసి తమ ఎస్‌యూవీ వాహనంతో 8 కిలోమీటర్లు ఫాలో అవుతూ వెంబడించి వేధించారు. 

పోలీస్‌ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయగా వారు అక్కడికి చేరుకుంటుండగా వికాస్‌, ఆశిష్‌లు తమ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, ఆ మరుసటిరోజు రాత్రి జరిగిన వేధింపులు, కిడ్నాప్‌ యత్నం ఘటనను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై 354డీ తోపాటు మోటారు వెహికల్‌ యాక్ట్‌లోని ఐపీసీ 185 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు