మూడు నెలలుగా ఝాన్సీకి వేధింపులు..

8 Feb, 2019 16:00 IST|Sakshi

హైదరాబాద్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి నాగ ఝాన్సీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఝాన్సీ కాల్‌ డేటా, వాట్సాప్‌ చాటింగ్‌ సంభాషణలపై పోలీసులు దృష్టి సారించారు. ఆమె ప్రియుడు సూర్య తేజ ప్రమేయంపై దర్యాప్తు చేపట్టారు. ఝాన్సీ సెల్‌ ఫోన్‌ లాక్‌ను ఓపెన్ చేసిన పోలీసులు ప్రియుడితో ఆమె చేసిన చాటింగ్‌ డేటాను రికవరీ చేశారు. మృతురాలి సెల్‌ఫోన్‌లో ఉన్న మెసేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. పలువురితో ఝాన్సీ చేసిన వాట్సప్ చాటింగ్‌, మెసేజ్‌లతో పాటు కొన్ని వీడియోలను గుర్తించినట్లు పంజాగుట్ట ఏసీపీ తెలిపారు. వాటి ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడే సమయంలో చివరిసారిగా ప్రియుడు సూర్య తేజకు మెసేజ్‌ పంపినట్లు రికార్డు అయింది. అయితే ఆమె పంపించిన మెసేజ్‌కు సూర్య స్పందించకపోవడంతో ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

కాగా గత కొంతకాలంలో ఝాన్సీని సూర్య వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందంటూ, ఎవరితో మాట్లాడవద్దంటూ ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఆ వేధింపులు శ్రుతిమించడంతో నెల క్రితం కూడా ఝాన్సీ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక చనిపోయే ముందు రోజు కూడా సూర్య-ఝాన్సీ మధ్య వివాదం ఏర్పడింది. ఆ తర్వాత ఝాన్సీ అర్థరాత్రి వరకూ సూర్యకు 14 మెసేజ్‌లు పంపించింది. అంతేకాకుండా ఫోన్‌ చేసినా సూర్య కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు