సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నయీం కేసు వివరాలు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులను కోరింది. దీంతో అధికారులు నయీం కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నయాం కేసులో బీసీ సంఘాల నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారుల పేర్లు ఉండటం కలకలం రేపుతోంది. అంతేకాకుండా పలువురు టీఆర్ఎస్ నాయకులు కూడా ఈ కేసులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఎక్కువ మంది టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరినవారే కావడం గమనార్హం. నయీం కేసును సిట్కు అప్పగించిన తర్వాత 250 కేసుల నమోదు అయ్యాయి. అంతేకాకుండా 1.944 కేజీల బంగారం, 2,482 కేజీల వెండి, రెండు కోట్ల రూపాయలకు పైగా నగదును అధికారులు సీజ్ చేశారు.
ఆ జాబితాలోని పేర్లు...
2016లో షాద్నగర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో నయీం మరణించిన సంగతి తెలిసిందే. ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డ నయీంకు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో తెరవెనుక సంబంధాలు ఉన్నట్టు.. అతని ఎన్కౌంటర్ తర్వాత వెలుగుచూసింది. అధికార టీఆర్ఎస్ నాయకులతోపాటు, ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ నేతలతోనూ నయీంతో దగ్గరి సంబంధాలు ఉన్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నయీంతో పలువురు నాయకులు అంటకాగి.. భారీగా భూ దందాలు సాగించారు.