ఆశ్చర్యపరుస్తోన్న రవి శేఖర్‌ నేర చరిత్ర

3 Aug, 2019 19:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత నెల 23వ తేదీన హయత్‌నగర్‌ యువతి కిడ్నాప్‌కు పాల్పడిన రవి శేఖర్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ మాట్లాడుతూ.. ‘రవి శేఖర్‌ మే 23న విజయవాడ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని రైలు ఎక్కాడు. ఈ క్రమంలో రైలులో కర్ణాటక కోప్పల్‌కు చెందిన ఓ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. చర్చి కట్టడానికి సాయం చేస్తానని మాయ మాటలు చెప్పి వారి ఇంటికి వెళ్లాడు. బళ్లారిలో తనకు రూ. 3 కోట్ల డబ్బు ఉందని.. వెళ్లి తీసుకొస్తానని చెప్పి.. వారి ఐ20 కారుతో ఉడాయించాడు’ అని తెలిపారు.

‘జూలై 21వ తేదీన రవి శేఖర్‌ హైదరాబాద్‌లో ప్రత్యక్షం అయ్యాడు. సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌ నుంచి వచ్చానని చెప్పి డబ్బులు వసూలు చేసి.. అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. జూలై 23న హయత్‌నగర్‌లో సోనిని కిడ్నాప్ చేశాడు. రవి శేఖర్‌ కోసం కడప, ఒంటిమిట్ట, తిరుపతిలో గాలించాము. 29 తేదీన నల్గొండ వాడపల్లిలో ఓ ఎరువులు దుకాణం దగ్గరికి వెళ్లి తనిఖీల పేరుతో రూ.80 వేల నగదుతో పరారయ్యాడు రవి శేఖర్‌. విజయవాడ వైపుగా వెళ్లాడని తెలియడంతో ఏపీ పోలీసులు సాయం తీసుకున్నాం. ఎనిమిది రోజుల తర్వాత జూలై 30న సోనిని వదిలేశాడు. అనంతరం అతడిని అరెస్ట్‌ చేశాం. రవి శేఖర్‌ను పట్టుకోవడంలో ఏపీ పోలీసులు బాగా సహకరించారు’ అని భగవత్‌ తెలిపారు.

అంతేకాక ‘రవి శేఖర్‌ మీద తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో కూడా కలుపుకుని 65కు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క ఏపీలోనే ఇతడి మీద 50 కేసులు నమోదయ్యాయి. 2001 నుంచి రవి శేఖర్‌ నేరాలకు పాల్పడుతున్నాడు. 2006-2017 వరకూ తెలంగాణలో విజిలెన్స్‌ ఆఫీసర్‌, జడ్జీ కుమారుడిని, ఏసీబీ అధికారిని అంటూ మోసాలకు పాల్పడ్డాడు. 2014లో భువనగిరిలో పీడీఎస్‌లో అవకతవకలు అంటూ వెళ్లి షాప్ యజమానిని బెదిరించాడు. అనంతరం యజమాని భార్యతో బైక్ పైన ఉడాయించి, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిపోయాడు. రెండు రోజులు తరువాత ఆమెను విడిచి పెట్టాడు’ అని భగవత్‌ తెలిపారు.

రవి శేఖర్‌ డబ్బులు వసూలు చేయడమే కాక పాటు మహిళలను మోసం చేస్తున్నాడన్నారు. అంగన్‌వాడి వర్కర్స్‌ను ట్రాప్ చేసి మోసం చేశాడని తెలిపారు. బ్యాక్ డోర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ మోసం చేస్తున్నాడు. ఇలాంటి వారిని నమ్మవద్దు అని మహేష్‌ భగవత్‌ ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు