ఉద్యోగాల పేరుతో వ్యభిచారం

9 Jul, 2020 09:51 IST|Sakshi

అంతర్రాష్ట్ర మహిళల అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు

యాప్రాల్‌లో ఇద్దరు మహిళలను సంరక్షించిన రాచకొండ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: ఉద్యోగాల పేరుతో ముంబయ్‌కి చెందిన మహిళలను నగరానికి తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను పట్టుకున్న పోలీసులు ఇద్దరు యువతులకు వ్యభిచారం నుంచి విముక్తి కల్పించారు. పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపినమేరకు..బిహార్‌ రాష్ట్రానికి చెందిన మిథిలేష్‌ శర్మ, రాజనీశ్‌ రాజన్‌లు గత కొన్ని సంవత్సరాలుగా రహస్యంగా హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహ్తిన్నారు. అయితే ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళల అక్రమ రవాణాదారులతో సంబంధాలున్న వీరు అక్కడి నుంచి అమ్మాయిలను రప్పించేవారు. ఈ విధంగానే ముంబయ్‌ సమీపంలోని పాల్ఘర్‌ జిల్లా నాలాసొపార పట్టణానికి చెందిన ఇద్దరు అమ్మాయిలకు హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రప్పించారు. (వేశ్యావాటిక గుట్టురట్టు)

ఆ తర్వాత బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపారు. యాప్రాల్‌లోని రిజిస్ట్రేషన్‌ కాలనీలో ఇండిపెండెంట్‌ హౌస్‌ను అద్దెకు తీసుకొని అసాంఘిక కార్యకలాపాలు మొదలెట్టారు. మిథేశ్‌ శర్మ తన సహచర నిర్వాహకుడు రాజనీశ్‌ రాజన్‌తో కలిసి రహస్యంగా కస్టమర్లను రప్పించేవాడు.అలాగే ఆయా ఇళ్లకు వచ్చే కస్టమర్లకు తగిన ఆహరంతో పాటు వారి అవసరాలను తీర్చేందుకు సుచిత్రకు చెందిన కాంబ్లీ సుఖేష్‌ను ఉద్యోగంలోకి తీసుకున్నారు. అయితే యథావిధిగా ఎప్పటిలాగానే మంగళవారం  ఇద్దరు విటులు సాయికిరణ్, సిరాజ్‌లు యాప్రాల్‌కు వచ్చారు. ఆ అమ్మాయిలతో వీరిద్దరూ ఉన్న సమయంలో అప్పటికే విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి జోన్‌ ఎస్‌వోటీ పోలీసులు, జవహర్‌ నగర్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. రాజనీశ్‌ రంజన్, సుఖేష్‌ రావణ్‌ కాంబ్లీ, పి.సాయికిరణ్, ఎండీ సిరాజ్‌లను అరెస్టు చేశారు. ఇద్దరు యువతులను సంరక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు మితిలేష్‌ శర్మ కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు