జీకేవీకే విద్యార్థి ఆత్మహత్య
కర్ణాటక,యశవంతపుర: వర్శిటీలో ర్యాగింగ్ వేధింపులు భరించలేక ప్రతిభావంత విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు యలహంక పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. గౌరిబిదనూరుకు చెందిన గగన్ (21) బెంగళూరు వ్యవసాయ వర్సిటీ (జీకేవీకే)లో బీఎస్సీ అగ్రికల్చర్ ఫస్టియర్ చదువుతూ అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్లోని సీనియర్ విద్యార్థులు నిత్యం ర్యాగింగ్ పేరుతో గగన్ను నానా విధాలుగా వేధిస్తున్నారు. దీనితో విరక్తి కలిగిన గగన్ మంగళవారం రాత్రి జీకేవీకే సమీపంలోని రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. టెన్త్, పీయుసీలో అత్యధిక మార్కులతో పాసైన గగన్కు జీకేవీకేలో ఉచితంగా బీఎస్సీ సీటు వచ్చిందని అతని మామ మల్లేశ్ తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.