బాలికలపై ర్యాగింగ్‌ పంజా

21 Jul, 2018 08:12 IST|Sakshi
పోలీసు స్టేషన్‌ను ముట్టడించిన బాలికల కుటుంబీకులు, బంధువులు

రసాయన పొడి సేవించి ఆత్మహత్యాయత్నం

ఇద్దరు యువకులు అరెస్ట్‌

సేలం: ఆంతరంగిక ఫోటోలను బయటపెడతా మంటూ బెదిరిస్తూ ర్యాగింగ్‌కు పాల్పడడాన్ని తట్టుకోలేక ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన సేలం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేలం జిల్లా ఓమలూరు సమీపంలోని కాడయాంపట్టి బోయర్‌ వీధికి చెందిన ఇద్దరు బాలికలు. వీరు నడుపట్టి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిది, పదో తరగతిలు చదువుకుంటున్నారు. ఇద్దరూ రోజూ ఇంటి నుంచి ఒకటిగా పాఠశాలకు వెళుతుంటా రు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఆ బాలికలను అడ్డుకుని చెప్పినట్టు వినాలని.. లేదంటే అంతరంగిక ఫోటోలను బయటపెడతామని బెదిరిస్తూ ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. తీవ్ర మనోవేదనతో బాలికలు ఇద్దరు గురువారం పాఠశాల గదిలో రసాయన పొడిని నీళ్లలో కలుపుకుని తాగారు. వాంతులు చేసుకోవడంతో వారు ఆత్మహత్యకు ప్రయత్నించిన విషయం తెలిసింది. వారిని హుటాహుటిన కాడయాంపట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు.

పోలీస్‌ స్టేషన్‌ ముట్టడి..
బాలికల కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో శుక్రవారం ఉదయం తీవట్టిపట్టి పోలీసు స్టేషన్‌ను ముట్టడించి ఆందోళన చేశారు. ర్యాగింగ్‌ చేసిన వారిని అరెస్టు చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. తర్వాత కాడయాంపట్టికి చెందిన భాస్కరన్‌ కుమారుడు సెల్వమణి (21), ఆర్ముగం కుమారుడు దురైమురుగన్‌ (19)లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సెల్వమణి పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. దురైమురుగున్‌ ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.

మరిన్ని వార్తలు