బరంపురం రైల్వేస్టేషన్‌లో టీటీఈపై జీఆర్‌పీ దాడి

18 Apr, 2018 07:13 IST|Sakshi
గాయాలపాలైన కిరణ్‌సాగర్‌

తాటిచెట్లపాలెం : విల్లుపురం సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో టీటీఈగా విధులు నిర్వహిస్తున్న బి.కిరణ్‌ సాగర్‌పై బరంపురంలో గవర్నమెంటు రైల్వే పోలీసులు దాడి చేసి గాయపరి చారు.  బరంపురం రైల్వేస్టేషన్‌లో తీవ్ర గాయాలపాలైన టీటీఈ బి.కిరణ్‌ సాగర్‌ను తోటి టీటీఈలు ఆస్పత్రిలో చేర్చారు. బాధిత  టీటీఈ బి.కిరణ్‌ సాగర్, తోటి టీటీఈలు అందించిన సమాచారం ప్రకారం... సోమవారం రాత్రి విల్లుపురం సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఖుర్దా నుంచి విశాఖపట్నం వరకు టీటీఈగా బి.కిరణ్‌ సాగర్‌ (విశాఖపట్నం) విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో  ఖుర్దా నుంచి బయలుదేరిన ఎక్స్‌ప్రెస్‌లో యూనిఫాం  లేకుండా ఉన్న ఓ జీఆర్‌పీ పోలీసును టీటీఈ కిరణ్‌ టికెట్‌ అడిగారు.

దీంతో ఆ వ్యక్తి తాను  పోలీసునని బదులివ్వగా  ఐడీ కార్డు చూపించాలని టీటీఈ కిరణ్‌ అడిగారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతలో  సరిగ్గా రాత్రి 11 గంటలకు రైలు బరంపురం స్టేషన్‌ 2వ ఫ్లాట్‌ఫాంపైకి వచ్చి అగింది. ఆ సమయంలో మరో 5గురు జీఆర్‌పీ పోలీసులు  యూనిఫాం లేకుండా వచ్చి ట్రైన్‌లో ప్రయాణిస్తున్న జీఆర్‌పీ పోలీసును కలిశారు. అనంతరం అందరూ కలిసి టీటీఈ కిరణ్‌ సాగర్‌పై దాడి చేసి గాయపరిచారు. సమాచారం అందుకున్న తోటి టీటీఈలు గాయాలపాలైన కిరణ్‌ సాగర్‌ను తొలుత రైల్వే ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు.

జీఆర్పీ ఐఐసీ సస్పెన్షన్‌
భువనేశ్వర్‌ : టికెట్‌ లేని ప్రయాణం చేసిన ప్రభుత్వ రైల్వే పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌చార్జిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. బరంపురం ప్రభుత్వ రైల్వే పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌  ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజేంద్ర కుమార్‌ ముండాని విధుల నుంచి స స్పెండ్‌ చేసినట్లు ఒడిశా పోలీసు ప్రధాన కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు