క్యాష్‌ చేసుకోవాలనుకున్నాడు.. కటకటాలపాలయ్యాడు

22 May, 2020 17:04 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఆర్‌పీఎఫ్‌ ఓసీ కె.కె.సాహూ, వెనుక నిందితుడు(వృత్తంలో)

సాక్షి, శ్రీకాకుళం: లాక్‌డౌన్‌ వేళ రైల్వే టికెట్లను క్యాష్‌ చేసుకోవాలని అడ్డదారిలో వెళ్లిన ఓ వ్యక్తి కటకటాలపాలైన సంఘటన పలాసలో చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ–టికెట్లు విక్రయిస్తున్న సెల్‌ఫోన్‌ విక్రయదారుడ్ని రైల్వే పోలీసులు అరెస్టు చేసి షాపును సీజ్‌ చేశారు. పలాస ఆర్‌పీఎఫ్‌ ఓసీ కె.కె.సాహు గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. రైల్వే మార్కెట్‌ పాత జాతీయ రహదారి రోడ్డులో చందన కమ్యూనికేషన్‌ పేరుతో సకలాబత్తుల గిరీష్‌కుమార్‌ అనే వ్యక్తి సెల్‌రీచార్జ్‌తో పాటు రైల్వే టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంటాడు.

ప్రస్తుతం కోవిడ్‌–19 సందర్భంగా రైల్వేశాఖ శ్రామిక రైళ్లను నడుపుతోంది. ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో గిరీష్‌కుమార్‌ ఈ–టికెట్లను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నట్లు రైల్వేశాఖ గుర్తించింది. మొత్తం 13 టికెట్లును ఆన్‌లైన్‌లో తీసుకున్నట్లు రైల్వేశాఖ ఐఆర్‌సీటీసీ అధికారులు ఢిల్లీలో గుర్తించి ఖుర్దారోడ్‌ డివిజన్‌ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఓసీ కె.కె.సాహు తన సిబ్బందితో సహా రంగంలోకి దిగి గురువారం షాపును తనిఖీ చేయగా వాస్తవమని తేలింది. చదవండి: చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్‌ 

రైల్వే నిబంధనల ప్రకారం ఇతరులు రైల్వే టిక్కెట్లు అమ్మకూడదు. ఒక వ్యక్తి తన పాస్‌వర్డ్‌ వినియోగించి తన అవసరాలకు మాత్రమే టికెట్లు కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. పెద్ద నగరాల్లో రైల్వేశాఖ అనుమతులతో నిబంధనలకు లోబడి టిక్కెట్లు విక్రయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒకే పాస్‌వర్డ్‌తో టికెట్లు కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయాడు. గత ఏడాది ఆగస్టులో ఇదే సెంటరుపై రైల్వేశాఖ దాడి చేసి కేసును నమోదు చేసింది. మళ్లీ అదే సంఘటన పునరావృతం కావడంతో రైల్వే అధికారులు సీరియస్‌గా పరిగణించారు. ఆయన్ను అరెస్టు చేయడంతో పాటు షాపును సైతం సీజ్‌ చేశారు. కార్యక్రమంలో ఆర్‌పీఎఫ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: దొంగ చేతివాటం: ఏకంగా ఆర్టీసీ బస్సునే..

  

మరిన్ని వార్తలు