అరుణ్ హత్య కేసులో నిందితుడి అరెస్టు
నిందితుడు రైల్వే పోలీస్ ఏఎస్ఐ?
ముషీరాబాద్: హిమాయత్నగర్లోని జేఎక్స్ ప్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్లో మేనేజర్గా పనిచేస్తున్న అరుణ్ జార్జి (37) హత్యకేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రైల్వే పోలీస్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నట్లు తెలిసింది. హత్యకు గురైన అరుణ్ పనిచేసే జెఎక్స్ ప్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్లో ఏఎస్ఐ అక్క కుమార్తె కూడా పని చేస్తోంది. ఆమె భర్త దుబాయ్లో ఉంటున్నాడు. అయితే అరుణ్ తన అక్క కూతురితో చనువుగా ఉంటున్నాడని ఏఎస్ఐ అరుణ్పై కక్ష పెంచుకున్నాడు.
ఈ విషయమై పలుమార్లు అరుణ్ను హెచ్చరించినా అరుణ్ పద్దతి మార్చుకోకపోవడంతో ఏఎస్ఐ అతనిపై కోపంగా ఉన్నాడు. శనివారం రాత్రి ఇదే విషయంపై అడిగేందుకు ఏఎస్ఐ రాంనగర్లోని అరుణ్ ఇంటికి వచ్చినట్లు తెలిసింది. అప్పటికే అరుణ్ మద్యం మత్తులో ఉండటంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి హత్యకు దారితీసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరు పరచనున్నట్లు సమాచారం.