రైల్వే ఈ–టికెట్‌ మోసగానికి ఉగ్ర బంధం!

27 Jan, 2020 08:18 IST|Sakshi

గులామ్‌ ముస్తాఫ్‌ విచారణకు సీసీబీ సిద్ధం

బనశంకరి: రైల్వేశాఖ వెబ్‌సైట్‌ హ్యాక్‌ చేసి నకిలీ యూజ్‌ర్‌ ఐడీ సృష్టించి ఇ–టికెట్లను విక్రయిస్తున్న ముఠాలో పట్టుబడిన సైబర్‌ వంచకుడు గులామ్‌ ముస్తాఫ్‌కు పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉండవచ్చని సీసీబీ నగరపోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌ డార్క్‌నెట్‌ వెబ్‌సైట్‌ను వినియోగించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు వెబ్‌సైట్లను గులామ్‌ హ్యాక్‌ చేశాడు. వివిధ శాఖలు వినియోగించే సాఫ్ట్‌వేర్స్‌ను తన నియంత్రణలో పెట్టుకున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో ఉన్న అనేక కార్యాలయాల బ్యాంక్‌ అకౌంట్లు వివరాలు, సాప్ట్‌వేర్లు డేటా సేకరించాడననే ఆందోళనకరమైన సంగతి ఆర్‌పీఎఫ్‌ పోలీసుల విచారణలో వెలుగుచూసింది.  రైల్వే నకిలీ ఇ–టికెట్‌ విక్రయాల దందాలో అగస్టు 31న పీణ్యా సమీపంలోని రాఘవేంద్రనగర నివాసి హనుమంతరాజును యశవంతపుర రైల్వేపోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడు అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ తీవ్రత రం చేశారు. రాజగోపాలనగరలో నివాసముంటున్న జార్ఖండ్‌కు చెందిన గులామ్‌ ముస్తాఫ్‌ను జనవరి 08 తేదీన పోలీసులు అరెస్ట్‌ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  

ల్యాప్‌టాప్‌లో ముఖ్య డేటా
 గులామ్‌ ముస్తాఫ్‌ వినియోగిస్తున్న ల్యాప్‌టాప్, కంప్యూటర్, హార్డ్‌డిస్క్‌ ఇతర ఉపకరణాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల డేటా లభించింది. అంతేగాక డాక్క్‌నెట్‌ వెబ్‌సైట్‌ నుంచి పాకిస్తాన్‌  ఉగ్ర సంస్థలను సంప్రదించినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాలనగర పోలీసులు అదుపులో ఉన్న ముస్తాఫ్‌ను విచారించడానికి సీసీబీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.  

సాఫ్ట్‌వేర్‌ పాక్‌ నుంచి  
 ఇతడు డార్క్‌నెట్‌ వెబ్‌సైట్‌తో హ్యాకింగ్‌ చేయడానికి లినక్స్‌ సాప్ట్‌వేర్‌ వినియోగించాడు. హ్యాకర్లు అక్రమ కార్యకలాపాలకు డార్క్‌నెట్‌ వైబ్‌సైట్‌ ను వినియోగించేవారు. ముస్తాఫ్‌ పాకిస్తాన్‌కు చెందిన సైబర్‌ వంచకుల ద్వారా డార్క్‌నెట్‌ , లినక్స్‌ హ్యాకింగ్‌ సాప్ట్‌వేర్‌ తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే కోర్టు అనుమతి తీసుకుని అతన్ని విచారిస్తామని సీసీబీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

మరిన్ని వార్తలు