కొడుకును నీళ్లలో ముంచి.. హాయిగా నిద్రపోయింది!

21 May, 2019 20:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జైపూర్‌ : రాజస్తాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆరునెలల వయసున్న బాలుడిని కన్నతల్లే నీళ్లలో ముంచి హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దీపికా గుజ్జర్‌(35) అనే మహిళ భర్త సీతారాం, కుమారుడు శివతో కలిసి కోటాలోని సరస్వతి కాలనీలో నివసిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి తన కుమారుడిని మిద్దెపైకి తీసుకువెళ్లి అక్కడున్న వాటర్‌ ట్యాంకులో పడేసింది. అనంతరం మళ్లీ వచ్చి తన గదిలో ఎప్పటిలా నిద్రపోయింది. అయితే కాసేపటి తర్వాత నిద్రలేచిన సీతారాం.. శివ ఎక్కడ అని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెప్పింది. దీంతో వెంటనే బంధువులకు సమాచారం అందించగా.. వారంతా బాలుడి కోసం వెదకడం ప్రారంభించారు. ఈ క్రమంలో మూడో అంతస్తులో ఉన్న వాటర్‌ ట్యాంకులో చిన్నారి మృతదేహం లభించింది.

ఈ నేపథ్యంలో మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీపికాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ‘ అయ్యో..! నా కొడుకును నేను చంపానా. అలా జరిగి ఉండదు. నాకేమీ గుర్తులేదు అంటూ దీపిక బోరున విలపించింది’ అని పోలీసులు పేర్కొన్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితురాలు ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించిందని తెలిపారు. కాగా గతంలో ఆమె ఇద్దరు పిల్లలు కూడా చిన్న వయసులోనే చనిపోయారని.. అయితే వారిది సహజ మరణమేనని వెల్లడించారు.

మరిన్ని వార్తలు