నేను మగాడినే.. కోర్టులో నిరూపిస్తా..

20 Jan, 2018 12:45 IST|Sakshi
రాజేష్‌.. పక్కన పెళ్లినాటి ఫొటో

చిత్తూరు జైలు నుంచి విడుదలైన రాజేష్‌

సాక్షి, చిత్తూరు: ‘ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 45 రోజుల పాటు నా కన్నతల్లిని చూడకుండా చేశారు. పైగా నేను మగాడ్ని కాదంటూ, సంసారానికి పనికిరాడని నాపై అభాండాలు వేశారు. నేను మగాడ్నే. మెడికల్‌ బోర్డు కూడా నా లైంగిక పటుత్వ పరీక్షలు పరీక్షించి ఎలాంటి లోపం లేదని నివేదిక ఇచ్చింది..’ అంటూ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఉపాధ్యాయుడు రాజేష్‌ పేర్కొన్నాడు. గంగాధరనెల్లూరుకు చెందిన శైలజను వివాహమాడిని ఉపాధ్యాయుడు రాజేష్‌కు మగతనం లేదని గుర్తించి చెప్పడంతో దాడి చేశాడనే ఆరోపణలపై పోలీసులు నిందితుడితో పాటు అతని తండ్రిని సైతం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

రాజేష్, అతని తండ్రికి న్యాయస్థానం బెయిల్‌ ఇవ్వడంతో శుక్రవారం చిత్తూరు నగరంలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం రాజేష్‌ మీడియాతో మాట్లాడుతూ తన నిర్దోషిత్వంపై న్యాయ పోరాటం చేసి నిరూపించుకుంటానన్నాడు. పోలీసుల దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానన్నాడు. శైలజ తనపై చేసిన ఆరోపణలన్నీ అబద్దమన్నాడు. తనను శాడిస్ట్‌తో పోల్చొద్దంటూ కోరాడు.

గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన రాజేష్‌.. వి.కోటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతడికి నవంబర్‌ 1న గంగాధర నెల్లూరు మండలం దామరగుంటకు చెందిన శైలజతో పెళ్లైంది. సంసార జీవితానికి పనికిరాడంటూ ఆరోపణలు చేయడంతో తొలిరాత్రి నాడే భార్యపై దాడిచేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి..
ఈ ఉదంతంతో తమ ఊరి అబ్బాయిలను పెళ్లాడేందుకు అమ్మాయిలు భయపడుతున్నారని మోతరంగనపల్లి వాసులు అంటున్నారు. ఇప్పటికే మూడు పెళ్లి సంబంధాలు వెళ్లిపోయాయని తెలిపారు. సంసారానికి పనికిరాడంటూ రాజేష్‌పై నిందలు వేశారని, పటుత్వ పరీక్షలో అతడికి ఎటువంటి లోపం లేదని తేలిందన్నారు. పదేపదే పనికిరానివాడంటూ, శాడిస్టు మొగుడంటూ ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అతడిపై నిందలు వేసినవారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎవరో చేసిన పనికి తమ ఊరి పరువు తీయొద్దని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు