నగదు చోరీ కేసులో దర్యాప్తు ముమ్మరం

7 May, 2019 21:00 IST|Sakshi

హైదరాబాద్‌: వనస్థలిపురంలోని యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎం వద్ద జరిగిన నగదు చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏటీఎంలో డబ్బులు వేయడానికి వచ్చిన సిబ్బందిని సుమారు 6 గంటలుగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆటో ఎక్కడ నుంచి వచ్చింది..దుండగులు ఆటోను అద్దెకు మాట్లాడుకున్నారా లేక దొంగిలించిన ఆటోనా..అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఒకే నెంబర్‌పై రెండు ఆటోలు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బులు వేయడానికి వచ్చిన సిబ్బంది తీరుపై కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

సిబ్బందిలోనే ఎవరైనా దుండుగులకు సమాచారమిచ్చి ఈ చోరీకి కుట్రపన్ని ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ప్రత్యేక టీంలతో సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నగరమంతా పోలీసులు జల్లెడ పడుతున్నారు. పురానా పూల్‌ బ్రిడ్జి వద్ద ఆటోను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పనామా కూడలి వద్ద నున్న యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెట్టేందుకు సెక్యూరిటీ సిబ్బంది నగదు పెట్టెలు తీసుకువచ్చిన సమయంలో వారి దృష్టి మరల్చి రూ.70 లక్షలున్న పెట్టె ఎత్తుకెళ్లిన సంగతి తెల్సిందే.

మరిన్ని వార్తలు