మయురా లాడ్జిపై పోలీసుల దాడి
ముగ్గురు యువతులు, ఆరుగురు యువకుల అరెస్ట్.
బాలికపై లైంగికదాడికి యువకుడి యత్నం
బహదూర్పురా: జూపార్కుకు ఎదురుగా ఉన్న మయురా లాడ్జిలో గురువారం అర్ధరాత్రి ముజ్రా పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో కాలాపత్తర్ పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు యువతులు, ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ ములుగురి రవి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాలాపత్తర్కు చెందిన మహ్మద్ సమీ తన పుట్టినరోజు సందర్భంగా మరో ఐదుగురు స్నేహితులతో కలిసి మయురా లాడ్జిలో గుట్టు చప్పుడు కాకుండా ముజ్రా పార్టీ (రేవ్ పార్టీ) జరుపునేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. పార్టీలో పాల్గొనేందుకు యువతుల కోసం తనకు ఫేస్బుక్లో పరిచయం అయిన రుహీ అనే మహిళను సంప్రదించాడు.
ఆమె తన సంరక్షణలో ఉంటున్న రాజేంద్రనగర్కు చెందిన బాలికతో (17)పాటు, చాంద్రాయణగుట్టకు చెందిన మరో ఇద్దరు యువతులను అక్కడి పంపేందుకు రూ.6 వేలకు బేరం కుదుర్చుకుని లాడ్జికి పంపించింది. గురువారం రాత్రి సమీ అతని స్నేహితులు ఖుద్దూస్, ముక్తాస్, సయ్యద్ అహ్మద్, మామా షాజీర్తో పాటు మరో స్నేహితుడైన మయురా లాడ్జి యజమాని అబూబాకర్ హుక్కా సేవిస్తూ అశ్లీల నృత్యాలు చేస్తున్నారు. మహ్మద్ సమీ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పార్టీపై సమాచారం అందడంతో కాలాపత్తర్ పోలీసులు దాడులు నిర్వహించి ముగ్గురు యువతులు, బర్త్డే బాయ్ సమీతో పాటు అతని ఐదుగురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. రెండు సౌండ్ బాక్స్లు, ఒక హుక్కా పరికరం, ఒక వైన్ బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.