మాఫియాకు రాచమార్గం

27 Feb, 2018 11:02 IST|Sakshi
దొంగ నోట్లను చలామణీ చేస్తున్న నిందితులను మీడియా ముందు హాజరుపరిచిన పోలీసులు

ఆంధ్రా టు తెలంగాణ అక్రమ రవాణా

పశువులు, గంజాయి, రేషన్‌ బియ్యం యథేచ్ఛగా తరలింపు

దొంగ నోట్ల మార్పిడికీ అడ్డాగా దేవరపల్లి–జీలుగుమిల్లి రోడ్డు

ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమ రవాణాకు దేవరపల్లి–జీలుగుమిల్లి రోడ్డు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. విశాఖ నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు వాహనాలు ఇటుగా వెళుతుండటంతో రోడ్డు రద్దీగా ఉంటుంది. దీంతో ఈ మార్గాన్ని అడ్డాగా మార్చుకుని పశువులు, గంజాయి, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలతోపాటు దొంగనోట్ల మార్పిడి సాగుతోంది. 

సాక్షి ప్రతినిధి, ఏలూరు: దేవరపల్లి–జీలుగుమిల్లి మార్గంలో అక్రమ రవాణా మాఫియాను పట్టుకోవడానికి పోలీసులు ఏడాదిలో రెండుసార్లు కాల్పులు జరపాల్సి వచ్చింది. జిల్లాలో గంజాయి సాగు లేకపోయినా విశాఖ  ఏ జెన్సీ నుంచి జిల్లా మీదుగా గంజాయి అ క్రమ రవాణా సాగుతోంది. రవాణాలో కీలకపాత్రధారులు జిల్లావారు కావడంతో గుట్టుచప్పుడు కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. అయితే అప్పుడప్పు డు పోలీసులకు వచ్చిన సమాచారంతో భారీగా గంజాయి పట్టుపడుతోంది. విశా ఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పండించిన గంజాయిని హైదరాబాద్, మహారాష్ట్రకు వయా పశ్చిమగోదావరి జిల్లా నుంచి సరిహద్దు దాటిస్తున్నారు.

దీని కోసం ప్ర త్యేకమైన రూట్లను స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా ఒక రూట్‌లోను, దేవరపల్లి, నల్లజర్ల, ద్వారకాతిరుమల, కామవరపుకోట, చింతలపూడి మీదుగా మరో రూట్‌లో రాష్ట్ర సరి హద్దులు దాటిస్తున్నారు. దీనిలో జిల్లాకు చెందిన స్థానిక వ్యక్తులతో పాటు పోలీసులలో కూడా కొందరు సహకరిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల గంజా యి వ్యవహారంలో చింతలపూడి సీఐపై సస్పెన్షన్‌ వేటు పడిన సంగతి తెలిసిందే.  

 పశువుల అక్రమ రవాణా విషయానికి వస్తే జిల్లాలో ఇప్పటివరకూ 24 కేసులు నమోదు కాగా సుమారు 1,850 ఆవులను పోలీసులు పట్టుకుని గోసంరక్షణ సమితికి అప్పగించారు. జిల్లా మీదుగా ప శువుల అక్రమ రవాణా చాలా కాలంగా జరుగుతోంది. జిల్లా సరిహద్దులు దాటిం చేందుకు ఏకంగా ఒక ముఠా పనిచేస్తోం ది. దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం మీదుగా వీటి ని తరలించేవారు.  అప్పుడప్పుడు రూ ట్‌ మార్చి నల్లజర్ల, కామవరపుకోట, చిం తలపూడి మీదుగా జిల్లా సరిహద్దులు దా టిస్తున్నారు. ఎక్కడైనా పోలీసులు దాడి చేసి పశువులను రవాణా చేసు ్తన్న వాహనాలు సీజ్‌ చేస్తే దగ్గరలోని గో శాలకు తరలించి అక్కడి నుంచి రాత్రికి రాత్రే తెలంగాణాకు తరలిస్తున్నారు. గతంలో దేవరపల్లి వద్ద పట్టుకున్న గోవులు సకాలంలో గోశాలకు తరలించకపోవడంతో 40 వరకూ హృదయవిదారక పరిస్థితిలో మృతి చెందడం వివాదం అయ్యింది.
 
పేదలకు ఇచ్చే రేషన్‌ బియ్యం  అ క్రమ రవాణాకు కూడా మాఫియా ఈ రూట్‌నే ఎంచుకోవడం గమనార్హం. తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇదే రూట్‌లో కాకినాడ పోర్టుకు ఈ బి య్యం చేరుతున్నాయి. మధ్యలో తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని రైస్‌ మిల్లుల్లో వీటిని రీసైక్లింగ్, పాలిష్‌ చేసి ఏదొక బ్రాండ్‌ పేరుతో 25 కేజీల బ్యాగ్‌ల్లో నింపుతున్నారు. ఇలా చేసిన బ్యాగ్‌లను కాకినాడ పోర్టు నుంచి బంగ్లాదేశ్‌కు తరలిస్తున్నారు. ఈ రూట్‌లో పోలీసుల సహకా రం ఉండటంతో ఇంత పెద్ద ఎత్తున అక్రమ రవాణా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. 

 ఒకే రోజు జిల్లాలో రెండు దొంగనో ట్ల కేసులు నమోదు కావడం విశేషం. దేవరపల్లి, నరసాపురంలో దొంగనోట్ల ముఠాలను పట్టుకున్నారు. ఇద్దరు నిరాయుధులను పట్టుకోవడం కోసం దేవరపల్లిలో కాల్పులదాకా వెళ్లాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం డిపార్టుమెంట్‌లోనే వ్యక్తమైంది. ఇటీవల యర్నగూడెం వద్ద దొం గనోట్ల ముఠా పోలీసులపై దాడికి ప్రయత్నించి తప్పించుకుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారన్నది తెలియాల్సి ఉంది.
 

దేవరపల్లి–జీలుగుమిల్లి మార్గంలోని పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులు 

దేవరపల్లిలో..
గంజాయి కేసులు    4
గోవుల రవాణా    3
రేషన్‌ బియ్యం    2
దొంగనోట్ల మార్పిడి    1
గోపాలపురంలో..
గంజాయి కేసు    1
గోవుల రవాణా    1
నల్లజర్లలో.. 
గోవుల రవాణా    2
లింగపాలెంలో..
రేషన్‌ బియ్యం    2
కామవరపుకోటలో..
గోవుల రవాణా    1
కొయ్యలగూడెంలో..
గోవుల రవాణా    6
గుట్కా, ఖైనీ రవాణా    1
జంగారెడ్డిగూడెంలో..
గోవుల రవాణా    2
రేషన్‌ బియ్యం    1
బుట్టాయిగూడెంలో
గోవుల రవాణా    1
జీలుగుమిల్లిలో..
గంజాయి రవాణా    1
రేషన్‌ బియ్యం    1
చింతలపూడిలో..
గంజాయి కేసు    1
రేషన్‌ బియ్యం    1
 

మరిన్ని వార్తలు