-

అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య

22 Dec, 2017 03:19 IST|Sakshi

నక్కపల్లి (పాయకరావుపేట): వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక పులిబంటి రామకృష్ణ (36) అనే రైతు పురుగు మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం జగన్నాధపురంలో ఈ ఘటన జరిగింది. మృతుడి భార్య నూకరత్నం గురువారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. రామకృష్ణకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుమార్తెకు ఇటీవల వివాహం చేశాడు. ఆయనకు సొంతంగా రెండెకరాల పొలం ఉండగా, వివాహమైన కుమార్తెకు 60 సెంట్ల భూమి కానుకగా ఇచ్చాడు. మిగిలిన భూమికి తోడు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు.

వరుసగా నాలుగేళ్ల నుంచి పంటలు సరిగా పండక పెట్టుబడులు కూడా రాలేదు. గ్రామంలో పైవేటు వ్యాపారుల వద్ద మరో రూ.2.50 లక్షల వరకు అప్పులు చేశాడు. పెట్టుబడులు, ఇంటిఖర్చుల కారణంగా పెరుగుతున్న అప్పులు ఎలా తీర్చాలో తెలియక తరచూ మదనపడేవాడు. ఈ బాధలు తట్టుకోలేక మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో పొలంలోకి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని నూకరత్నం తెలిపింది. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు