ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను..

10 Aug, 2019 18:02 IST|Sakshi

సాక్షి, అదిలాబాద్‌ : ఉద్యోగం ఇప్పిస్తానని మహిళకు మాయ మాటలు చెప్పి..  వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి అమ్మేసిన ఘటన కోమరం భీం జిల్లాలో చోటు చేసుకుంది. తిర్యాణి మండలం కొలం తెగకు చెందిన మతిస్థిమితం లేని గిరిజన మహిళను సమీప బంధువుతోపాటు ఓ వ్యక్తి  మాయమాటలతో లొంగదీసుకొని మధ్యప్రదేశ్‌లోని మండ్పుర్‌ జిల్లాలోని ఓ వ్యక్తికి అమ్మేశారు. కూతురు కనబడటం లేదని మహిళ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో, తన కూతురు ఎక్కడికి వెళ్లలేదని తండ్రిని మభ్యపెట్టారు. మహిళను మధ్యప్రదేశ్‌లో ఇంటి పనులకు వాడుకోవడమే కాకుండా.. శారీరకంగా నరకం చూపించడంతో తప్పించుకొని ఇంటికి చేరుకుంది.

అనంతరం కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్‌ విధించింది. డీఎస్‌పీ సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా అక్రమ రవాణాకు పాల్పడ్డ ముఠాను అరెస్టు చేశామని, నిందుతులకు శిక్ష పడేలా చేస్తామని తెలిపారు. గిరిజన మహిళలు ఇలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

మరిన్ని వార్తలు