జగ్గారెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌

11 Sep, 2018 16:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నకిలీ పాస్‌పోర్ట్‌లతో అక్రమ రవాణా చేసిన కేసులో జగ్గారెడ్డిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం జగ్గారెడ్డిని పద్నాలుగు రోజులపాటు రిమాండ్‌కు తరలించింది. రిమాండ్‌ రిపోర్ట్‌లోని వివరాలు.. 2004లో నిర్మల, విజయ లక్ష్మి, భరత్‌ల పేర్లతో పాస్‌పోర్ట్‌లు పొందారు. ఏజెంట్‌ మధు ద్వారా ముగ్గురిని తన భార్యా పిల్లల పేర్లతో అమెరికాకు పంపేందుకు 15 లక్షలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కూతురు విజయ లక్ష్మి పేరుతో శ్రీ తేజ జూనియర్‌ కాలేజీ నుంచి బోనఫైడ్‌ సంపాదించారు. ఆమె పుట్టిన రోజును 1987 సెప్టెంబర్‌ 3గా పేర్కొన్నారు. కొడుకు భరత్‌ సాయి రెడ్డి పేరు కోసం సంగారెడ్డిలోని కరుణ స్కూల్‌ నుంచి బోనోఫైడ్‌, క్యారెక్టర్‌ సర్టిఫికెట్స్‌ పొందారు. అతని పుట్టిన రోజును 1989 మార్చి 5గా పేర్కొన్నారు.

ఈ వివరాలు జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డుల్లో తేడాలున్నాయి. పాస్పోర్ట్ కార్యాలయం సీనియర్ సూపరింటెండెంట్, గతంలో జగ్గారెడ్డి దగ్గర పీఏగా పనిచేసిన రాజేందర్ తో పాటు మరో ఇద్దరిని సాక్ష్యులుగా చేర్చారు. భార్య పిల్లలుగా పాస్పార్ట్ల్లో ఉన్న ఫొటోలు జగ్గారెడ్డి ఫ్యామిలివీ కాదని రాజేందర్‌ తెలిపారు. వీసా పొందిన తరువాత తన స్నేహితుడు కుసుమ కుమార్ తో కలిసి ఆ ముగ్గుర్ని జగ్గారెడ్డి న్యూ యార్క్ తీసుకెళ్ళారు. ఇలా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పాస్ పోర్ట్ వీసాలు పొంది దేశ భద్రతకు ముప్పు తెచ్చారు.  2016లో తన పాస్ పోర్ట్ పోయిందని కొత్త పాస్ పోర్ట్ కోసం జగ్గారెడ్డి దరఖాస్తు చేసుకున్నాడు.
 

మరిన్ని వార్తలు