కార్లు అద్దెకు తీసుకుని అమ్మేస్తాడు

22 Dec, 2018 10:21 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి

నిందితుడి అరెస్టు  

రూ.3.38 లక్షల నగదు స్వాధీనం  

ఐదు కార్లు సీజ్‌  

నాంపల్లి: కార్లు అద్దెకు తీసుకుని అమ్మి సొమ్ము చేసుకుంటున్న ముఠా గుట్టును నాంపల్లి పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు సభ్యుల ముఠాలో ఒకరిని అరెస్ట్‌ చేయగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. సైఫాబాద్‌ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌ సుభాష్‌ చంద్రబోస్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. నాంపల్లి ఏ బ్యాటరీ లేన్‌కు చెందిన మహ్మద్‌ అఫ్జల్, మహ్మద్‌ ఇద్రీస్‌ ఖలీమ్, సయ్యద్‌ ఇమ్రాన్‌ స్నేహితులు. జల్సాలకు అలవాటుపడిన వీరు మోసాలకు తెరలేపారు.

ఇందులో భాగంగా కార్లను అద్దెకు తీసుకుని అవి తమవేనంటూ నమ్మించి ఇతరులకు విక్రయిస్తున్నారు. కార్వాన్‌ సబ్సిమండికి చెందిన మహ్మద్‌ ఖలీమ్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నాంపల్లి పోలీసులు ఆధారాలు సేకరించారు. మహ్మద్‌ అఫ్జల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు అంగీకరించాడు.  అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మహ్మద్‌ ఇద్రీస్‌ ఖలీమ్, సయ్యద్‌ ఇమ్రాన్‌ల కోసం గాలింపు చేపట్టారు. సమావేశంలో అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజేష్, ఎస్సైలు  సైదా, ప్రమోద్‌ రెడ్డి, పెంటయ్య గౌడ్, శ్రీకాంత్‌ రెడ్డి  పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు