విలేకరి గోవర్ధన్‌ ఆకస్మిక మృతి

23 Jul, 2018 10:37 IST|Sakshi
మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి తదితరులు గోవర్ధన్‌ (ఫైల్‌)

అనంతపురం రూరల్‌: విలేకరి గోవర్ధన్‌ (41) ఆకస్మికంగా మృతి చెందారు. రామగిరికి చెందిన ఈయన అనంతపురంలో ఆంధ్రభూమి విలేకరిగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో అనంతపురం ప్రెస్‌క్లబ్‌లోని గదిలో మంచంపై కూర్చుని పేపర్‌ చదువుతున్న ఆయన ఉన్నట్టుండి కుప్పకూలారు. కొద్దిసేపటి తర్వాత అక్కడకు వచ్చిన తోటి జర్నలిస్టులు ఏమిలా పడిపోయాడని లేపడానికి ప్రయత్నించగా ఉలుకూపలుకూ లేకపోయింది. వెంటనే 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగా.. అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలియగానే రామగిరి నుంచి కుటుంబ సభ్యులు హుటాహుటిన బయల్దేరి ప్రెస్‌క్లబ్‌కు చేరుకుని బోరున విలపించారు.  సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీ నేతల నివాళి
ప్రెస్‌క్లబ్‌లో హఠాన్మరణం చెందిన విలేకరి గోవర్ధన్‌ మృతదేహాన్ని వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడి, నాయకులు వై.వి.శివారెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డిలు సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వై.వి.శివారెడ్డి విలేకరి కుటుంబానికి ఆర్థికసహాయం అందించారు. ఎస్పీ అశోక్‌కుమార్, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డిలు విలేకరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్రీటౌన్‌ సీఐ మురళీ, ఎస్‌ఐ జైపాల్‌రెడ్డిలు మృతి చెందిన పాత్రికేయుని వివరాలు సేకరించారు. 

మరిన్ని వార్తలు