మైనర్‌ బాలికతో ఆర్‌ఎంపీ అసభ్య ప్రవర్తన

2 Dec, 2019 12:54 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: మైనర్‌ బాలిక పట్ల ఓ ఆర్‌ఎంపీ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని జులైవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ బాలిక 8వ తరగతి చదువుతోంది. అక్కడే పాఠశాలకు దగ్గరలో ఉన్న ఎస్టీ హాస్టల్‌లో ఉంటోంది. గతనెల 28న బాధిత విద్యార్థినికి కంటిపై కురుపు రావడంతో చికిత్స కోసం ఆర్‌ఎంపీ రాజు వద్దకు వచ్చింది. ఈ క్రమంలో రాజు బాలికకు మత్తు మందు ఇచ్చి ఒంటిపై ఉన్న వస్త్రాలు విప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడు.

దీంతో బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పాఠశాలకు, హాస్టల్‌కు మధ్య ఉన్న యశ్వంత్‌ క్లినిక్‌లో ఆర్‌ఎంపీ రాజు మెడికల్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. బాధిత బాలిక తల్లి శనివారం రాత్రి సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు రాజుపై ఐపీసీ 354, 509 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు