సోదరికి అన్యాయం చేశాడని..

13 Jun, 2019 18:57 IST|Sakshi

ఆర్‌ఎంపీ హత్యకేసులో ఐదుగురి అరెస్టు

సాక్షి, పశ్చిమగోదావరి : భీమవరంలో కలకలం సృష్టించిన ఆర్‌ఎంపీ హత్యకేసులో పోలీసులు ఐదురుగురిని అరెస్టు చేశారు. అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న తమ సోదరికి అన్యాయం చేసి మరో మహిళను వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న ఆర్‌ఎంపీ నరసింహమూర్తి బావమరదులు అతన్ని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన వారం క్రితం జరుగగా తాజాగా వెలుగులోకొచ్చింది. భీమవరం పట్టణంలోని చినరంగనిపాలెంకు చెందిన మామిడిశెట్టి నరసింహమూర్తి(36) శ్రీనివాస్‌ సెంటర్‌లో శివప్రియ ప్రాథమిక కేంద్రం నిర్వహిస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం రాజరాజేశ్వరి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. రాజరాజేశ్వరితో విభేదాలు రావడంతో రెండో వివాహం చేసుకున్నాడు. 

మొదటి భార్యకు జన్మించిన ముగ్గురు ఆడపిల్లలు అతడితోనే ఉంటున్నారు. అప్పుడప్పుడు రాజ రాజేశ్వరి.. పిల్లలను చూసేందుకు వస్తుండేది. అయితే తన సోదరిని వదిలేసి వేరే మహిళను వివాహం చేసుకున్నాడని కక్ష పెంచుకున్న రాజరాజేశ్వరి సోదరులు దోనబోయిన లక్ష్మీ నారాయణ, నరసింహరావు నరసింహమూర్తిని చంపాలని కుట్ర పన్నారు. ఈనెల 4వ తేదీన నరసింహమూర్తిన కారులో ఎక్కించుకుని తూర్పుగోదావరి జిల్లా వైపు తీసుకువెళ్లారు. కారులోనే అతని  పీక నులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచెలో కుక్కి బిక్కవోలు-సామర్లకోట మధ్యలో ఉన్న ఒక పంట బోదెలో విసిరేశారు. రెండు రోజులైనా భర్త తిరిగి రాకపోవడంతో రెండో భార్య స్వప్నమంజరి భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈనెల 7వ తేదీన ఫిర్యాదు చేశారు. లక్ష్మీ నారాయణ, నరసింహరావుపై ఆమె అనుమానం వ్యక్తం చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ హరికృష్ణ దర్యాప్తు ప్రారంచి దోనబోయిన లక్ష్మీనారాయణ, నరసింహరావులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు మరో ముగ్గురిని తాజాగా అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు