సాక్షి, కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 15 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలికిపురం నుంచి వైజాగ్ వెళ్తున్న రాజోలు డిపోకు చెందిన బస్సును కాకినాడ నుంచి సత్తుపల్లి వెళ్తున్న లారీ అచ్చంపేట జంక్షన్లో వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఘటనా సమయంలో ఆర్టీసీ బస్సులో 35 మంది దాకా ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. వీరిలో 15 మంది గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని పోలీసులు చికిత్స నిమిత్తం కాకినాడకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.
బస్సు ప్రమాదంపై మంత్రి ఆరా :
తూర్పుగోదావరి జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మాట్లాడి సహాయకచర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే క్షతగాత్రులకి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.