ఫ్లైయాష్‌ ట్యాంకర్‌ – కారు ఢీ

29 Apr, 2018 08:30 IST|Sakshi
మృతిచెందిన విజయలక్ష్మి, రమేష్‌బాబు రెడ్డి

బద్వేలుఅర్బన్‌/గోపవరం : బద్వేలు–నెల్లూరు జాతీయ రహదారిలోని గోపవరం మండల చెక్‌పోస్టు సమీపంలో శనివారం ఫ్లైయాష్‌ ట్యాంకర్‌– కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. పట్టణంలోని సురేంద్రనగర్‌కు చెందిన కె.విజయలక్ష్మి(55) కడపలోని అరవింద్‌నగర్‌లో నివసించే తన సోదరుడైన (పెదనాన్న కుమారుడు) చలమల రమేష్‌బాబు రెడ్డి (45) భార్య మమతతో కలిసి శుక్రవారం సాయంత్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగే ఓ శుభకార్యానికి వెళ్లారు.

అదే శుభకార్యానికి శనివారం ఉదయం రమేష్‌బాబు రెడ్డి కూడా కడప నుంచి బయలుదేరి వెళ్లారు. శుభకార్యం ముగిసిన అనంతరం అక్కడే భోజనం చేసుకుని కారులో బద్వేలుకు బయలుదేరారు. ఈ క్రమంలో గోపవరం మండలంలోని ద్వారక కంకరమిల్లు–చెక్‌పోస్టు మధ్యలో తాడిపత్రి నుంచి నెల్లూరుకు వెళ్తున్న ట్యాంకర్‌ ఎదురుగా వస్తున్న కారు ముందుభాగంలో ఢీ కొనడంతో విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన రమేష్‌బాబు రెడ్డిని, అతని భార్య మమతను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రమేష్‌రెడ్డి మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన మమతను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రూరల్‌ పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్యాంకర్‌ను స్టేషన్‌కు తరలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఎమ్మెల్సీ నివాళి 

శనివారం గోపవరం మండల చెక్‌పోస్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయలక్ష్మి స్థానిక వైఎస్సార్‌ సీపీ నాయకుడు యద్దారెడ్డికి వదినతో పాటు ఆర్టీసీ ఎన్‌ఎంయూ డిపో అధ్యక్షుడు చిన్నపురెడ్డి భార్య కావడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య సురేంద్రనగర్‌లోని వారి ఇంటి వద్దకు వెళ్లి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు