కారు ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి

6 Sep, 2019 09:15 IST|Sakshi

సాక్షి, రైల్వేకోడూరు : ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక వస్తున్న కారు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. రైల్వేకోడూరు మండలం మైసూరివారిపల్లె పంచాయతీ మ్యాంగో యార్డు సమీపంలో కడప– తిరుపతి జాతీయ రహదారిపై గురువారం ఉదయం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో మైసూరివారిపల్లెకు చెందిన కావేటి శివయ్య (45), లక్కాకుల మురళి (43) మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

మైసూరివారిపల్లెకు చెందిన కావేటి శివయ్య మ్యాంగో యార్డు వద్ద టీ కొట్టు నిర్వహిస్తూ ఆయా సీజన్లలో మామిడి, బొప్పాయి వ్యా పారాలు చేసేవాడు. అతని గ్రామానికి చెందిన బంధువు లక్కాకుల మురళితో కలిసి గురువారం ఉదయం మ్యాంగో యార్డుకు వచ్చేందుకు ద్విచక్రవాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో కడప – తిరుపతి జాతీయ రహదారిపై వెనుక వస్తున్న రైల్వేకోడూరుకు చెందిన ఓ కారు వేగంగా వచ్చి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ద్విచక్రవాహనం దెబ్బతినగా శివయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

ఎడమ కాలు విరిగి తీవ్ర రక్తస్రావమైన మురళిని తిరుపతికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో కుక్కలదొడ్డి వద్ద  మృతి చెందాడు. ప్రమాదానికి గురైన కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. మృతుడు శివయ్యకు భార్య జ్యోతి కుమారి, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు తండ్రికి చేదోడువాదోడుగా టీ కొట్టులో ఉంటున్నాడు. మురళికి భార్య శారద ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతులిద్దరు బంధువులు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రాజంపేటకు తరలించారు.  

మరిన్ని వార్తలు