రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

19 Nov, 2019 10:39 IST|Sakshi
క్షతగాత్రులకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది

సాక్షి, దేవరకద్ర(మహబూబ్‌నగర్‌): తక్కువ సమయంలో గమ్యం చేరుకోవాలని.. అతివేగంతో వాహనం నడుపుతూ వచ్చాడు డ్రైవర్‌. స్పీడ్‌ పెరుగుతున్న కొద్దీ వాహనం అదుపు చేయలేకపోయాడు.. ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తోపాటు మరో మహిళ మృతిచెందగా.. 10మందికి గాయాలయ్యాయి.  ప్రమాదం జరిగిన సమయంలో వాహనం దాదాపు 100పైగా స్పీడ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన భూత్పూర్‌ మండలం అన్నాసాగర్‌ వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ట్యాక్సీతుఫాన్‌ వాహనం సోమవారం మధ్యాహ్నం ప్రయాణికులను ఎక్కించుకొని హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వైపు బయల్దేరింది. ఈ క్రమంలో భూత్పూర్‌ మండలం అన్నాసాగర్‌ దగ్గరకు రావడంతో వేగంగా ఉన్న వాహనం అదుపు తప్పి రోడ్డుకు దాదాపు 20 మీటర్ల దూరం పల్టీలు కొడుతూ చివరకు చెట్టును ఢీకొని బోల్తా పడింది. దీంతో వాహనంలో ఉన్న 12మందికి గాయాలయ్యాయి.

చికిత్స పొందుతూ ఇరువురి మృతి 
విషయం తెలుసుకున్న పోలీసులు, ఎల్‌అండ్‌టీ సిబ్బంది వెంటనే క్షతగాత్రులను 108వాహనంలో జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆస్పత్రికి తీసుకువచ్చిన అనంతరం తీవ్రంగా గాయపడిన హైదరాబాద్‌కు చెందిన డ్రైవర్‌ శేఖర్‌(27) మృతిచెందాడు. అలాగే, కోమాలోకి వెళ్లిన కర్నూల్‌ జిల్లా డోన్‌కు చెందిన మరో ప్రయాణికురాలు జయంతి(35)రాత్రి 7గంటల ప్రాంతంలో మృతి చెందారు.  

గాయపడ్డ వారి వివరాలు..
వాహనం బోల్తా పడిన ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిలో మానవపాడు మండలానికి చెందిన భార్య భర్తలు సంధ్య, మునిస్వామి, రాజస్థాన్‌కు చెందిన గజేందర్, గోవర్ధన్‌ ఉన్నారు. వీరితోపాటు కర్నూల్‌ జిల్లా కల్లూర్‌కు చెందిన భార్యభర్తలు సఫియా, బడేసాహెబ్, బిహార్‌కు చెందిన అల్లావుద్దీన్, కర్నూల్‌ జిల్లా బుద్వేల్‌కు చెందిన పద్మావతి, నర్దానా, కర్నూల్‌కు చెందిన వినయ్‌కుమార్‌తో మరో మహిళకు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. 

మరిన్ని వార్తలు