రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరుకు చెందిన పలువురు సోమవారం పొలతలకు వెళ్తుండగా.. అనంతరాజుపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఎనిమిది మంది గాయాల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే... కార్తీక సోమవారం సందర్భంగా రైల్వేకోడూరులోని ఆంజనేయస్వామి వీధికి చెందిన ఇరుగుపొరుగు వారు కలిసి.. పొలతల పుణ్యక్షేత్రానికి టాటా సుమోలో బయలుదేరారు. ఇందులో నార్తాల అంజమ్మ, గీత, కమరం సుబ్బమ్మ, రాణి, సరస్వతి, సోమశేఖర్, చిన్నమస్తాన్, మస్తాన్ తదితరులు ఉన్నారు.
కొంత దూరం వెళ్లిన తర్వాత అనంతరాజుపేట వైకోట క్రాస్ వద్ద.. ఎదురుగా వస్తున్న లారీ అదుపు తప్పి రాంగ్ రూట్లో వచ్చి ఢీకొంది. దీంతో సుమోలో ప్రయాణిస్తున్న అల్లెమ్మ, సోమశేఖర్, గీతకు చేతులు విరిగాయి. రాణి తలకు తీవ్ర గాయమైంది. మిగిలిన వారు సాధారణ గాయాలతో బయటపడ్డారు. బాధితులను 108 వాహనం ద్వారా రైల్వేకోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన వారిని 108 వాహనం ద్వారానే తిరుపతికి తీసుకెళ్లారు.