కాల్వను మింగేసిన కబ్జాదారులు

7 Mar, 2019 09:34 IST|Sakshi
మూసీపై వేసిన రోడ్డు గుండా వెళ్తున్న వాహనదారుడు

సాక్షి, రాజేంద్రనగర్‌: నదిపై వంతెన, రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే లక్షలాది రూపాయలు, సంవత్సరం పాటు సమయం పడుతుంది. అదే కబ్జాదారులకు ఆ పని అప్పగిస్తే రాత్రికి రాత్రే రోడ్డును పూర్తి చేస్తారు. ఇది మాటల్లో కాదూ చేతల్లో చేసి చూపించారు కబ్జారాయుళ్లు... వివరాల్లోకి వెళితే.. హిమాయత్‌సాగర్‌ జలాశయం నుంచి వచ్చే వరద నీటిని కిస్మత్‌ఫూర్, బండ్లగూడ మీదుగా సంఘం వద్ద మూసీ నదిలోకి కలిసేలా గతంలో 220 అడుగుల కాల్వను ఏర్పాటు చేశారు.

దీనికి ఈసీ నదిగా పేరు పెట్టారు. మూసీ పేరుతోనే ఈ కాల్వ ప్రస్తుతం కొనసాగుతుంది. బండ్లగూడ పీఅండ్‌టీ కాలనీ నుంచి జనచైతన్య వెంచర్‌కు మధ్యన మూసీ నది అడ్డుగా ఉంది. ఈ రెండు ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో స్థానికంగా స్థలాలకు విపరీతమైన ధర పలుకుతోంది. ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ కొందరు మట్టిపోసి రోడ్డును ఏర్పాటు చేశారు. ఇదే అదునుగా మరికొందరు భారీ వాహనాలు వెళ్లేలా మట్టిని పోసి రోడ్డును తయారు చేశారు. ప్రస్తుతం ఈ రోడ్డు గుండా లారీలు, కార్లు, ద్విచక్ర వాహనాలు సులువుగా వెళ్తున్నాయి. ఇదే అదునుగా కొందరు కబ్జాదారులు మూసిలో సైతం మట్టిపోసి ప్లాట్లుగా విభజించి విక్రయించారు. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణాలు సైతం సాగుతున్నాయి. ఈ విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 

మరిన్ని వార్తలు