మత్తు మందు చల్లి ప్రొద్దుటూరులో చోరీ

3 May, 2018 12:57 IST|Sakshi
బంగారు, వెండి చోరీకి గురైన బీరువా

22 తులాల బంగారు,3.5 కిలోల వెండిఅపహరణ

ప్రొద్దుటూరు క్రైం : స్థానిక మైదుకూరు రోడ్డులోని బాలాజీనగర్‌–2లో నివాసం ఉంటున్న కాఫీడే డిస్ట్రిబ్యూటర్‌ ప్రదీప్‌రెడ్డి ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. నిద్రపోతున్న వ్యక్తిపై మత్తు మందు చల్లి అతని వద్ద ఉన్న తాళం చెవి తీసుకొని ఇంట్లోకి చొరబడ్డారు. టూ టౌన్‌ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రదీప్‌రెడ్డి కాఫీడే డిస్ట్రిబ్యూటర్‌గా పని చేస్తున్నాడు. అతను రెండు రోజుల క్రితం ఏజెన్సీ పనిపై క్యాంప్‌నకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన తండ్రి నరసింహారెడ్డి ప్రధాన ద్వారానికి తాళం వేసి మంగళవారం మిద్దెపై పడుకున్నారు. ప్రదీప్‌రెడ్డి భార్య శశికళ, కుమార్తె అనితశ్రీలు ఇంట్లోని రెండో బెడ్‌రూంలో పడుకున్నారు. ఈ క్రమంలో మిద్దెపై పడుకున్న నరసింహారెడ్డి మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నిద్రలేచి చూడగా దిండు కింద తాళాలు, సెల్‌ఫోను ఉన్నాయి.

బుధవారం వేకువ జామున 3.30 గంటలకు మెలకువలోకి వచ్చిన ఆయన దిండు కింద చూసుకోగా తాళాలు, సెల్‌ఫోన్‌ కనిపించలేదు. దీంతో కంగారుగా అతను కిందికి వెళ్లగా ఇంటి ప్రధాన ద్వారం తెరచి ఉంది. ఇంట్లో ఉన్న బీరువా కూడా తెరవబడి, అందులోని వస్తువులు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. రోజూ హాల్‌లోని ఫ్రిజ్‌పై మొదటి గది తాళం చెవి, బీరువా తాళాలు పెట్టే అలవాటు ఉందని, వాటిని తీసుకొని దుండగులు గదిలోకి ప్రవేశించారని నరసింహారెడ్డి తెలిపారు. తనపై మత్తు మందు చల్లడంతోనే వేకువ జాము వరకూ మెలుకువ రాలేదని, ఇప్పుడు కూడా మత్తుగా ఉందని ఆయన అన్నారు. విషయం తెలియడంతో డీఎస్పీ శ్రీనివాసరావు, వన్‌టౌన్‌ సీఐ వెంకటశివారెడ్డి, ఎస్‌ఐ మధుమళ్లేశ్వరరెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్‌ టీం అధికారులు కూడా సంఘటనా స్థలం లో వేలి ముద్రలు సేకరించారు.కేసు నమో దు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు