పంజగుట్ట: కరడుగట్టిన నేరస్తుడితోపాటు మరో నిందితుడిని పంజాగుట్ట పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. వారిలో ప్రధాన నిందితుడు ఫైజాన్ వయస్సు 19 ఏళ్లుగా, కాగా రాష్ట్ర వ్యాప్తంగా అతడిపై దాదాపు 20 కేసులు ఉన్నాయి. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి, క్రైమ్ ఇన్స్పెక్టర్ నాగయ్య, క్రైమ్ ఎస్సై షేక్ షఫీ వివరాలు వెల్లడించారు. నిజామాబాద్కు చెందిన సయ్యద్ ఫైజాన్ (19) డిగ్రీ చదువుతూ మధ్యలోనే మానేశాడు. అనంతరం పలు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు. తద్వారా వచ్చే సంపాదన ఖర్చులకు సరిపోకపోవడంతో దొంగతనాలు ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. ఐదుగురితో కలిసి ముఠా ఏర్పాటు చేసిన అతను నిజామాబాద్లో బైక్లను చోరీ చేసి హైదరాబాద్లో విక్రయించేవాడు. నగరంలో కొట్టేసిన ద్విచక్రవాహనాలను నిజామాబాద్లో అమ్మేవాడు. అతనిపై నగరంలోని పలు పోలీస్స్టేషన్లతో పాటు నిజామాబాద్లోనూ మొత్తం 14 బైక్ చోరీ కేసులు, 2 స్నాచింగ్ కేసులు ఉన్నాయి. శుక్రవారం నిందితుడు ఫైజాన్తో పాటు మరో నిందితుడు పహాడీషరీఫ్కు చెందిన షేక్ సోహైల్ను అరెస్ట్ చేసిన పంజగుట్ట పోలీసులు రిమాండ్కు తరలించారు.
బెయిల్పై బయటికి వచ్చి..
గతంలో బైక్ చోరీ కేసులో అరెస్టు చేసిన పంజగుట్ట పోలీసులు అతడిపై పీడీ యాక్ట్ నమోదుకు ప్రతిపాదనలు పంపారు. పీడీ యాక్టు ఉత్తర్వులు వచ్చే లోగా బెయిల్పై బయటికి వచ్చిన అతను తప్పించుకు తిరుగుతున్నాడు. పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత జులై 14న మంజుల అనే మహిళ మెడలో చైన్ లాక్కునేందుకు ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. వెనకే ఆమె భర్త మరికొందరు కారులో వచ్చి గట్టిగా అరవడంతో తప్పించుకుని పారి పోయాడు. ఈ నెల మొదటివారంలో పంజగుట్ట సర్కిల్ సతీష్ అనే ఫుడ్ డెలివరీ బాయ్ బైక్పై కూర్చుని ఫోన్లో మాట్లాడుతుండగా వెనకనుంచి వచ్చిన ఫైజాన్ ఫోన్ లాక్కెల్లాడు. రెండు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలించి శుక్రవారం అరెస్టు చేశారు. అతడి నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
డీజిల్ గ్యాంగ్ ఏర్పాటు ..
గతంలో బైక్ చోరీల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన ఫైజాన్ తన పంథా మార్చుకున్నాడు. మరో ఐదుగురితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. గజ్వేల్, షామీర్పేట ప్రాంతాల్లో రోడ్డుపై నిలిపి ఉంచిన లారీల నుంచి డీజిల్ చోరీ చేసి విక్రయించేవాడు. గజ్వేల్ పోలీస్స్టేషన్ పరిధిలో డిజిల్ చోరీ చేస్తుండగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని పట్టుకునేందుకు రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. కారులో వస్తున్న నిందితుడు ఫైజాన్ బారికేడ్లను ఢీకొట్టి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. కుక్కనూర్ పోలీస్స్టేషన్ పరిధిలో రాయల్ ఎన్ఫీల్డ్ చోరీకి పాల్పడిన అతడిని పోలీసులు పట్టుకునేందుకు వెళ్లగా ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టాడు.