ఊర్లో దొరలు.. బయట దొంగలు

12 Oct, 2019 13:01 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్‌

రూ.35 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం  

గచ్చిబౌలి: వ్యసాయం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, వాటర్‌ ప్లాంట్‌ నిర్వహణ తదితర వ్యాపకాలతో ఊర్లో  గౌరవంగా జీవిస్తున్న నలుగురు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి ఇతర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. పగటిపూటే ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ వీసీ సజ్జనార్‌ వివరాలు వెల్లడించారు.  ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, నంగల కటక్‌ గ్రామానికి చెందిన ఆదిత్య కుమార్‌ వాటర్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నాడు. అతను అదే గ్రామానికి చెందిన మెకానిక్, స్టాక్‌ బ్రోకర్‌ పని చేస్తున్న అమిత్‌గ్రామ్, ఉత్తరాఖండ్‌కు చెందిన మున్నిరాజ్‌ రాజౌరా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కోత్వాలీదేహత్, సురేంద్ర కుమార్‌ శర్మ, బులందర్‌ జిల్లాకు చెందిన రైతు పంకజ్‌ చౌదరితో ముఠాగా ఏర్పాటు చేశాడు.వీరు పలు రాష్ట్రాల్లో పగటి వేళల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. 2015 నుంచి సైబరాబాద్‌ పరిధిలో 5, సంగారెడ్డి, కరీంనగర్, ఒంగోలు, తమిళనాడులోని కాంచీపురం, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఒక్కో చోరీలకు పాల్పడ్డారు. 10 కేసుల్లో నిందితులుగా ఉన్నా ఇప్పటి వరకు ఎక్కడా పోలీసులకు పట్టుబడలేదు. వీరిపై నిఘా ఏర్పాటు చేసిన సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు  శుక్రవారం నిందితులను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి  రూ.35 లక్షల విలువైన బంగారు నగలు, 2 కిలోల వెండి  , ఇన్నోవా, బ్రెజా కార్లు స్వాధీనం చేసుకున్నారు.

ధనవంతుల ఇళ్లే టార్గెట్‌...
వీరు నలుగురు టూర్‌కు వెళుతున్నట్లు చెప్పి ఉత్తరప్రదేశ్‌ నుంచికారులో బయలుదేరేవారు. ఏ రాష్ట్రానికి వెళితే అక్కడి నెంబర్‌ ప్లేట్‌ను కారుకు అమర్చేవారు. స్టార్‌ హోటళ్లలో బస చేస్తూ గూగుల్‌ మ్యాప్‌లో ధనవంతులు నివాసం ఉండే విల్లాలు, లగ్జరీ అపార్ట్‌మెంట్లను గుర్తించేవారు. కారులో నేరుగా ఆయా ప్రాంతాలకు చేరుకునేవారు. ఆదిత్య, మున్నీరాజ్‌ కాలనీల్లో తిరుగుతూ అపార్ట్‌మెంట్, విల్లా కొనుగోలు కోసం వచ్చినట్లు చెబుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవారు. అనంతరం పథకం ప్రకారం ప్రత్యేకంగా తయారు చేసిన ఇనుప వస్తువులతో పగటిపూట తాళాలను విరగొట్టి 20 నిమిషాల్లోనే తమ పని పూర్తి చేసు కుని ఊడాయించేవారు. రెండు మూడు చోరీలు చేసి కిలోకు తక్కువ కాకుండా బంగారు ఆభరణాలతో ఉత్తరప్రదేశ్‌కు ఉడాయించేవారు. ఇదే తరహాలో బాచుపల్లి, నార్సింగి, రాయదుర్గం పీఎస్‌ల పరిధిలో చోరీలకు పాల్పడ్డారు. ఓ చోరీ కేసులో మున్నీ రాజ్‌ వేలి ముద్రలను గుర్తించిన పోలీసులు  గత నెల 30న ఉత్తరప్రదేశ్‌లోని షాహరాన్‌పూర్‌లో అతడిని అరెస్ట్‌ చేసి అక్కడే కోర్టులో హాజరుపరిచారు. అతడి సమాచారం మేరకు మిగతా నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు శుక్రవారం నగరానికి తీసుకువచ్చారు. కేసును చేధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని సీపీ అభినందించారు.

ఊర్లో పెద్దమనుషులుగాచలామణి...
నిందితులు నలుగురికీ సొంత ఊర్లలో మంచి పేరు ఉందని సీపీ తెలిపారు. గౌరవంగా బతుకుతున్న వీరు చోరీలకు పాల్పడినట్లు చెప్పగా గ్రామస్తులు నమ్మడం లేదన్నారు.  వ్యాపారాలు, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే వీరు జల్సాల కోసం చోరీలబాట పట్టినట్లు సీపీ వివరించారు.  సమావేశంలో సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిణి, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌ రావు, కూకట్‌పల్లి ఏసీపీ సురెందర్‌ రావు, సీఐలు రమేష్, జగదీశ్వర్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు