తల్లి, కుమార్తెను బావిలోకి తోసి..

26 Jan, 2019 12:18 IST|Sakshi
బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీస్తున్న దృశ్యం

రూ.15 వేలు, 4 సవర్ల నగలు దోపిడీ

చిన్నారి మృతి

చెన్నై , సేలం: తల్లి, కుమార్తెను బావిలో తోసి రూ.15 వేలు, 4 సవర్ల నగలతో పరారైన గుర్తు తెలియని ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటనలో చిన్నారి మృతి చెందింది. వివరాలు.. సేలం జిల్లా వీరగనూర్‌ సమీపంలో ఇలుప్పనత్తం గ్రామానికి చెందిన శివశంకర్‌ (34) విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతని భార్య ప్రియాంక (24). వీరి కుమార్తె శివాని (5). కాగా, శివశంకర్‌ విదేశాల నుంచి వేప్పూర్‌కు చెందిన అతని మిత్రుడు ఖాతాలో డబ్బులు వేస్తుంటాడు.

ఆ సమయంలో ప్రియాంక వేప్పూర్‌కు వెళ్లి డబ్బులు తీసుకువస్తుంది. ఈ క్రమంలో ప్రియాంక కుమార్తె శివానితో కలిసి గురువారం డబ్బు తీసుకుని తిరిగి వస్తోంది. వీరగనూర్‌ బస్టాండ్‌ సమీపంలో గుర్తుతెలియని ముఠా వారిని అడ్డుకుని రూ.15,000 నగదు, 4 సవర్ల నగలు దోపిడీ చేశారు. తల్లి, కుమార్తెను అక్కడే ఉన్న బావిలో తోసి పరారయ్యారు. ఈ ఘటనలో బావిలో పడిన శివాని మృతి చెందగా, ప్రియాంక ప్రాణాపాయస్థితిలో ఉంది. శుక్రవారం ఉదయం అక్కడికి వెళ్లిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరగనూర్‌ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రియాంకను రక్షించి చికిత్స నిమిత్తం ఇలుప్పనత్తం ప్రాథమిక వైద్య కేంద్రంలో చేర్చారు. శివాని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్తూర్‌ జీహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు