భారతానికి వెళితే ఇంట్లో దొంగలు పడ్డారు!

9 May, 2019 10:13 IST|Sakshi
దొంగలు పగులగొట్టిన బీరువా

చిత్తూరు అర్బన్‌ : మహాభారతం అంటే ఉన్న మక్కువ కొద్దీ వెళ్లి వచ్చేసరికి ఇంటిని దొంగలు ఊడ్చేశార్రా నాయనా! అని ఆ దంపతులు లబోదిబోమన్నారు. పోలీసుల వద్దకు పరుగులు తీశారు.  వివరాలు.. స్థానిక సాంబయ్యకండ్రిగ పెట్రోలు బంకు ఎదురుగా ఉ న్న ఇంట్లో లోకనాథరెడ్డి కాపురముంటున్నాడు. అక్కడే ఉన్న ఓ  ట్రాక్టర్‌ కంపెనీ లో ఈయన పనిచేస్తున్నాడు. మంగళవారం తన సొంతూరైన గంగాధరనెల్లూరు మండలం నెల్లేపల్లెమిట్టలో ‘మహాభారత యజ్ఞం’ ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇంటికి తాళం వేసి తన భార్యతో బైక్‌లో వెళ్లాడు. మంగళవారం అర్ధరాత్రి నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో పాల్గొని, అక్కడే పూజలు చేశారు. బుధవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి బయట తాళం పగులగొట్టి ఉండటం చూసి ఠారెత్తారు.

లోపలకు వెళ్లి చూస్తే బీరువాను కూడా పగులగొట్టి దాదాపు 160 గ్రా ములకు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి బావురుమన్నారు. ఫిర్యాదు చేయడంతో చిత్తూరు క్రైమ్‌ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చోరీ జరిగిన ఇంటికి సీసీ కెమెరాలు ఉండటంతో ఫుటేజీని పోలీసులు పరి శీలించారు.  చేతికి తొడుగులు ధరించి చోరీకి పాల్పడ్డట్లు ఫుటేజీల్లో నిక్షిప్తమవడం చూసి పోలీసులు ఈ దొంగోడు తెలివిగా పని కానిచ్చేశాడని నిర్ధారణకు వచ్చారు. కాగా, బయటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని..నగలను ఇంట్లో ఉంచరాదని చెబుతున్నా పెడచెవిన పెట్టడంతో పోలీ సులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. 3రోజుల క్రితమే ఓ ఇంట్లో దొంగలు పడి 80 సవర్ల బంగారు, రూ.1.50లక్షల చోరీ ఘటన మరువక ముందే మళ్లీ 48 గంటల వ్యవధిలోనే చోరీ జరగడంతో హడలిపోతున్నారు.

మరిన్ని వార్తలు