రౌడీషీటర్‌ దారుణహత్య

21 May, 2020 12:41 IST|Sakshi
అద్దేపల్లి సతీష్‌ (ఫైల్‌)

తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: పాత కక్షల నేపథ్యంలో రౌడీ షీటర్‌ను హత్య చేసిన సంఘటన త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. త్రీటౌన్‌ సీఐ దుర్గా ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం ఆర్యాపురం, రెడ్డీలపేటకు చెందిన అద్దేపల్లి సతీష్‌ (42) ఆనంద్‌ నగర్, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మరో మహిళ వద్ద ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నిద్రపోతున్న సతీష్‌కు అతని స్నేహితుడు కిషోర్‌ ఫోన్‌ చేసి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని ఆ ఇంటికి వెళ్లిసతీష్‌ను మోటారు సైకిల్‌పై క్వారీ మార్కెట్‌ ప్రాంతం టీవీ రోడ్డు వద్దకు తీసుకువెళ్లాడు.

అక్కడు వై.శ్రీను, మరికొంత మందితో కలసి తలపై కొట్టి హత్య చేశారు. మృతుడు ఆద్దేపల్లి సతీష్‌పై త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అనేక కేసులు ఉండడంతో రౌడీ షీట్‌ ఉంది. పాత రౌడీ షీటర్‌ యలమంచిలి శ్రీనుతో మృతుడు సతీష్‌కు పాత కక్షలతో, ఆర్థిక పరమైన లావాదేవీలు ఉండడంతో వీరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో సతీష్‌ సోదరుడికి ఫోన్‌ చేసి నీ తమ్ముడిని చంపేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యలో బుధవారం తెల్లవారు జామున సతీష్‌ను హతమార్చారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని త్రీటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ దుర్గా ప్రసాద్‌ పరిశీలించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు