రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ దారుణ హత్య

24 Apr, 2020 13:47 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట : గతకొంత కాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ దారుణ హత్యకు గురయ్యాడు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం రామంచ గ్రామ శివారులో ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వేట కొడవళ్లతో అతి దారుణంగా నరికి చంపారు. మెడపై గొడ్డలితో నరకడంతో శరీర భాగం నుంచి తల వేరైంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతుని స్వగ్రామం సిద్ధిపేట మండలం ఇమాంబాద్ అని పోలీసులు తెలిపారు. పాత కక్షనే ఈ హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగనోట్ల కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

ఎల్లంగౌడ్‌ పలు కేసుల్లో ప్రధాని నిందుతుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గతంలో శామీర్ పేట దగ్గర పోలీసులపై కాల్పులు జరిపి కానిస్టేబుల్‌ను హత్య చేసిన కేసులో ఎల్లంగౌడ్ ప్రధాన నిందితుడిగా గుర్తించబడ్డాడు. అంతేకాకుండా  కర్ణాటక, మహారాష్ట్రలోనూ ఇతనిపై పలు కేసులున్నట్లు సమాచారం. అయితే ఇతన్ని హత్య చేసేందుకు శత్రువులు ఇప్పటికే పలుమార్లు ప్రయత్నించారని, కానీ దాడి నుంచి తప్పించుకుని పరారీలో ఉన్నాడని స్థానికుల సమాచారం. ఈ క్రమంలోనే గురువారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు మాటు వేసి ఎల్లంగౌడ్‌ను హత్య చేశారు.

మరిన్ని వార్తలు