రూ.3.5 కోట్ల పాతనోట్లు పట్టివేత

11 Feb, 2019 10:49 IST|Sakshi

అహ‍్మదాబాద్ : పెద్ద నోట్లు రద్దు చేసి రెండేళ్లు కావస్తున్నా ఇంకా ఆ నోట్లు పెద్దమొత్తంలో పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్‌లోని నౌరాసిలో రూ.3.5 కోట్ల విలువైన పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఓ కారులో ఈ నగదును తరలిస్తుండగా...పోలీసులు పట్టుకున్నారు. పాత నోట్లు పట్టుబడిన విషయాన్ని గుజరాత్‌ ఎక్సైజ్ అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే  ఈ పాత కరెన్సీని ఎక్కడకు తరలిస్తున్నారనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కాగా కేంద్ర ప్రభుత్వం 2016లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన విషయం తెల్సిందే. రద్దు అయిన నోట్లను మార్చుకునేందుకు గడువు కూడా ఇవ్వడం జరిగింది. గడువు పూర్తి అయిన తర్వాత ఎవరి వద్దనైనా పాత నోట్లు ఉంటే శిక్షార్హం అంటూ కేంద్రం జీవో కూడా అమల్లోకి తెచ్చింది. అయినా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంకా రద్దయిన నోట్లను సీజ్ చేస్తూనే ఉన్నారు.

మరిన్ని వార్తలు