‘భారత్‌ మాతా కీ జై’ అంటూ ఆత్మాహుతి

10 Apr, 2018 13:22 IST|Sakshi
రఘువీర్‌ శరణ్‌ అగర్వాల్‌

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

జైపూర్‌: కులం, మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు, ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారనే నిరసనలతో గత కొన్ని రోజులుగా దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల పట్ల మనస్తాపంతో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త రఘువీర్‌ శరణ్‌ అగర్వాల్‌ (45) ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని వైశాలీ నగర్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. తనను తాను కాల్చుకున్న అనంతరం దాదాపు 100 మీటర్ల దూరం ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ శరణ్‌ పరుగెత్తడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

అతని ఒంటిపై నీరు పోసి మంటలార్పే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. తీవ్రమైన మంటల కారణంగా అతని శరీరం దాదాపు 80 శాతం కాలిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న బాధితున్ని మొదటగా సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం ఢిల్లీ​లోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శరణ్‌ మంగళవారం ఉదయం మరణించారు. శరణ్‌ మెడికల్‌ షాప్‌ నిర్వహిస్తున్నారనీ.. ఆయన మృతి వెనుక ఆర్థిక, కుటుంబ పరమైన కారణాలు కూడా ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు.

కలతే కారణం కావొచ్చు..
కులం, మతం ఆధారంగా రిజర్వేషన్లు, దళితులు చేపట్టిన భారత్‌బంద్‌ హింసాత్మకంగా మారి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చెలరేగిన విధ్వంసకర పరిస్థితుల పట్ల చరణ్‌ కలత చెంది ఉంటారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌ 10న మరోమారు భారత్‌ బంద్‌ అనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ చర్యకు పాల్పడొచ్చని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు