ఆర్టీసీ డ్రైవర్‌ దుర్మరణం

24 Feb, 2018 11:29 IST|Sakshi
ప్రమాదంలో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ నిరంజన్‌రెడ్డి (ఇన్‌సెట్‌లో)నిరంజన్‌రెడ్డి(ఫైల్‌)

గుర్తు తెలియని వాహనం ఢీకొని!

మృతదేహానికి నివాళులర్పించిన వాకాడు డిపో సిబ్బంది

కోట: గుర్తు తెలియని వాహనం ఢీకొని వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ బద్దెవోలు నిరంజన్‌రెడ్డి(47) మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున విద్యానగర్‌ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు, చిల్లకూరు మండలం పారిచెర్లపాళెంకు చెందిన నిరంజన్‌రెడ్డి మల్లాం–తిరుపతి సర్వీస్‌ 6 గంటల డ్యూటీకి పోవాల్సి ఉంది. అయితే ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి ద్విచక్ర వాహనంలో బయలుదేరిన నిరంజన్‌రెడ్డి మార్గమధ్యంలో విద్యానగర్‌ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. అయితే ప్రమాదం జరిగిన తీరుపై భిన్నకథనాలు వినిపిస్తున్నాయి. గుర్తు తెలియని వాహనం ఢీకొందని కొందరు చెబుతుండగా,  రోడ్డుకు అడ్డంగా పందులు రావడంతో ప్రమాదం జరిగిందని పలువురు పేర్కొం టున్నారు.

తలకు బలమైన గాయం కావడంతో నిరంజన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిరంజన్‌రెడ్డి వాకాడు ఆర్టీసీ డిపోలో 22 ఏళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నారు. విధుల్లో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. అదే విధంగా నేషనల్‌ మజ్ధూర్‌ యూనియన్‌ డిపో సెక్రటరీగా అందరికీ సుపరిచితుడే. నిరంజన్‌రెడ్డి మృతి వాకాడు డిపో సిబ్బందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నారాయణరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాలిరెడ్డిపాళెంకు తరలిం చారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు గుర్తు తెలి యని వాహనం ఢీకొని మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. డిపో మేనేజర్‌ ముక్తేశ్వరరావు, తోటి కార్మికులు నిరంజన్‌రెడ్డి మృత దేహానికి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు